జగన్ పార్టీ వేర్పాటువాదాన్ని రెచ్చగొడుతోంది: జూపూడి
విజయవాడ: ‘అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తే మరో విభజన ఆలోచన కొన్ని సంవత్సరాల తర్వాతైనా వచ్చే అవకాశముందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ధర్మానప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ వేర్పాటువాదాన్ని వినిపించడం దారుణమన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నారని, అభివృద్ధిలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను భాగస్వామ్యం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారం దక్కలేదని వేర్పాటు వాదాన్ని రెచ్చగొడతారా అని జూపూడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రాయలసీమ నేతలది ఒకమాట, ఉత్తరాంధ్ర నేతలది మరోమాటని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే వైసీపీ వేర్పాటువాద రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

ప్రత్యేక హోదాపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే తమకు అభ్యంతరం లేదని, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తే సహించేదిలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్కిషోర్ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా తారకమంత్రం కాదని ఆయన అన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. పోలీసులు రక్షణ కల్పించకుంటే తమకు తామే రక్షణ కల్పించుకుంటామని అన్నారు. విపక్షాలు విద్యార్థులకు మద్దతు పలకడం విచారకరమని శ్యామ్ కిషోర్ విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications