'ఆ మూడింటిలో'... టిక్కెట్ కట్ కట్ కట్ కటా!!
ఉత్తరాంధ్ర... ఈసారి రాష్ట్రానికి జరగబోయే ఎన్నికల్లో అత్యంత కీలకపాత్ర పోషించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించడంతోపాటు విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించడం రాజకీయంగా తమకు కలిసివస్తుందని వైసీపీ భావిస్తోంది. రానున్న ఎన్నికలు కూడా ఇదే కోణంలో జరగబోతున్నాయని స్పష్టమవుతోంది.
మార్పు రాకపోతే టికెట్ హుళక్కే?
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తమదే ప్రధానంగా పైచేయి అవుతోందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 34 స్థానాలకు వైసీపీ తరఫున 28 మంది గెలిచారు. రానున్న ఎన్నికల్లో సీటు దక్కాలంటే తాను చేయించుకునే సర్వేలో మంచి మార్కులు రావాలని, అలా రానివారికి కొంత సమయం ఇస్తానని, అప్పటికీ మార్పు రాకపోతే నిర్మొహమాటంగా సీటు వేరేవారికి కేటాయిస్తానని ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు.
సర్వే ప్రకారమే టికెట్లు?
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమవకపోతే సీటివ్వనని, తర్వాత తనను విమర్శించినా, తిట్టినా పట్టించుకోనని జగన్ చెబుతున్నారు. భీమిలీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు గత ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. మళ్లీ టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశం లేదని సర్వేలో వెల్లడైంది. గాజువాక నుంచి పోటీచేసిన తిప్పల నాగిరెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ నే ఓడించారు. అయితే వయోభారం కారణంగా ఆయన బదులు కొత్తవారు రంగప్రవేశం చేస్తారని భావిస్తున్నారు.
వర్క్ షాప్ తో ఒక స్పష్టత
వీరిద్దరితోపాటు పెందుర్తిలో గెలుపొందిన అదీప్ రాజ్, ఎలమంచిలి నుంచి కన్నబాబురాజుకు టికెట్ ఇచ్చే విషయమై జగన్ సానుకూల ధోరణిలో లేరని పార్టీలో ప్రచారం నడుస్తోంది. ఎలమంచిలో బలమైన సామాజికవర్గానికి టికెట్ కేటాయించే ఉద్దేశంతో సీఎం ఉన్నారు.
అలాగే పాడేరు, పాయకరావుపేట నియోజకవర్గాల్లో కూడా కొత్తవారిని తీసుకురావాలనే యోచన చేస్తున్నారు. పార్వతీపురం, ఎస్ కోట, నెల్లిమర్ల, బొబ్బిలి స్థానాల్లోనివారికి కూడా టికెట్ గండం పొంచివుందంటున్నారు..
అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గురించి పార్టీలో చర్చ సాగుతోంది. ఎచ్చెర్లలో కిరణ్ కుమార్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని పార్టీలోని మరో వర్గమే స్పష్టం చేస్తోంది. పాడేరులో కూడా ఇదే పరిస్థితి. డిసెంబరు తొలివారంలో జరిగే వర్క్ షాప్ లో ఒక స్పష్టత రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.