భజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసు: ఆరుగురు నిందితుల అరెస్ట్, 144 సెక్షన్ పొడిగింపు
బెంగళూరు: భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకేసులో పురోగతి సాధించారు పోలీసులు. శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు సంబంధించి కర్ణాటక పోలీసులు మంగళవారం మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి డజను మందిని ప్రశ్నించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.
సీఆర్పీసీ సెక్షన్ 144(ఒక ప్రాంతంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు సమావేశాన్ని నిరోధించం) శుక్రవారం ఉదయం వరకు మరో రెండు రోజులు పొడిగించినట్లు శివమొగ్గ జిల్లా డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సెల్వమణి ఆర్ తెలిపారు. ఈ సమయంలో పాఠశాలలు మూసివేయబడతాయని ఆయన తెలిపారు.

26 ఏళ్ల హర్ష నగారా హత్య సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియల ఊరేగింపులో ధ్వంసం, రాళ్లు రువ్వడానికి దారితీసింది. ఆదివారం రాత్రి మతపరమైన సున్నితమైన ప్రాంతంలోని తన ఇంటి నుంచి బయటకు రాగానే యువకుల ముఠా అతనిపై దాడి చేయడంతో అతను మరణించాడు.
ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయగా, మరో 12మందిపై విచారణ జరుగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో మహ్మద్ కాషిఫ్, సయ్యద్ నదీమ్, అఫ్సిఫుల్లా ఖాన్, రెహాన్ షరీఫ్, నిహాన్, అబ్దుల్ అఫ్నాన్ ఉన్నారు. శివమొగ్గా జిల్లా వ్యాప్తంగా గాలించి పట్టుకున్నామని అడిషనల్ డీజీపీ ప్రతాప్ రెడ్డి వివరించారు.
'హర్ష హత్య కేసుతో నగరమంతా అల్లర్లు చెలరేగాయి. శివమొగ్గా జిల్లాలో అదనపు బలగాలను దించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం. డిప్యూటీ కమిషనర్, ఎస్పీ భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మరే దారుణం జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం' అని అడిషనల్ డీజీపీ తెలిపారు.
ఘటనకు సంబంధించిన వివరాలు..
హర్షా(26) అనే భజరంగ్ దళ్ కార్యకర్తను ఆదివారం రాత్రి కొందరు దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న హర్షాను స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షా మృతి చెందాడు.
ఈ క్రమంలో సీగేహట్టి ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. స్థానిక భజరంగ్ నేతలు, ఇతర కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రోడ్డుపై వాహనాలను తగలబెట్టి, దుకాణాలను మూసివేశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న శిమొగా పోలీసులు అప్రమత్తమై సీగేహట్టి ఏరియాను ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరింపజేశారు. శిమొగ్గా జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేసి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు. హిజాబ్ వ్యవహారంతోపాటు అన్ని కోణాల్లోనూ ఈ హత్య కేసులో విచారణ జరుపుతున్నామని రాష్ట్ర మంత్రులు తెలిపారు.












Click it and Unblock the Notifications