షాకింగ్: జీపీఎస్ను నమ్మి నేరుగా నట్టేట్లోకి..!
అమెరికాలోని వీమౌంట్ రాష్ట్రంలో ఓ వ్యక్తి జీపీఎస్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకుంటూ తన వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లి నేరుగా వాహనం సహా నట్టేట్లో పడ్డాడు.
వాషింగ్టన్: అప్పుడప్పడు మన మెదడుకు కూడా పని చెప్పాలని... కేవలం యంత్రాల మీద, ఉపగ్రహాల మీద ఆధారపడితే విచక్షణా జ్ఞానం కూడా అంతరించిపోయి మనిషి కూడా ప్రాణం ఉన్న యంత్రంగా మారిపోతాడు.
దీనికి చక్కటి ఉదాహరణ అమెరికాలో జరిగిన ఈఘటన. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(జీపీఎస్)ను గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్లి నట్టేట్లో పడ్డాడు ఓ వ్యక్తి. అమెరికాలోని వీమాంట్ రాష్ట్రంలో చోటుచేసుకుంది ఈ ఘటన.
తారా గుర్టిన్ అనే పెద్దమనిషి జీప్ కంపాస్ను అద్దెకు తీసుకొని.. తన మిత్రబృందాన్ని ఎక్కించుకొని రైడ్కు బయల్దేరాడు. వెళ్లాల్సిన మార్గంపై కచ్చితమైన అవగాహన లేకపోవడంతో గూగుల్కు చెందిన జీపీఎస్ యాప్ వేజ్ను ఆన్ చేశాడు.
ఆ యాప్ చెప్పిన ప్రకారం కొంత దూరం వెళ్లగా ఒక బోట్ ర్యాంప్ వచ్చింది. దీనిని గుర్తించని ఆ వ్యక్తి యాప్ సూచనల మేరకు నేరుగా వాహనాన్ని పోనించాడు. అంతే- వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ నేరుగా ఓ సరస్సులోకి దూకింది.
అప్పటికే హిమపాతం కారణంగా నీరుగడ్డకట్టి ఉండటంతో జీపు కుంగలేదు. సరస్సలో కొద్ది దూరం వెళ్లాక వాహనం బరువుకు ఒక్కసారిగా మంచుపొర పగిలి ముందుభాగం నీటిలోకి కుంగింది. దీంతో ఆ వాహనంలోని ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టకొని బయటపడ్డారు.
సమాచారం అందుకొని అక్కడకు చేరుకొన్న పోలీసులు వాహనాన్ని బయటకు తీశారు. సదరు వాహనాన్ని నడిపిన డ్రైవర్ మద్యం మత్తులో లేడని వారు ధ్రువీకరించారు. కేవలం యాప్ చెప్పిన సూచనలను గుడ్డిగా నమ్మి డ్రైవింగ్ చేయడంతో ఈఘటన జరిగినట్లు తేల్చారు.
వేజ్ యాప్కు ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ యజమాని. దీనిలోని మ్యాప్లను మరింత కచ్చితంగా ఉంచేందుకు వినియోగదారులు ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఎవరో ఆ మ్యాప్ను ఎడిట్ చేయడం వల్ల ఈ ఘటన చోటుచేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.