స్వదేశానికి సంపన్నుల టాటా: ‘స్వర్గసీమ’ దేశాల బాట.. భారత్ తర్వాత ఫ్రాన్స్
న్యూఢిల్లీ: నల్లధన నియంత్రణకు కఠినమైన చట్టాలు రూపొందించడంతోపాటు సంస్కరణలను అమలులోకి వస్తున్న నేపథ్యంలో దేశం నుంచి పెద్ద సంఖ్యలో సంపన్నులు తమ మకాం మార్చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో దేశం నుంచి అధిక సంఖ్యలో సంపన్నులు విదేశాలకు వలసపోయారని ఒక అధ్యయనంలో తేలింది.
2014 నుంచి ఇప్పటి వరకు రూ.65 లక్షలు అంతకంటే ఎక్కువ సంపద కల సంపన్నులు దాదాపు 23 వేల మంది దేశం వదిలి సంపన్నుల స్వర్గసీమగా నిలిచే దేశాలకు మకాం మార్చారని మోర్గాన్ స్టాన్లీ ఇన్వెష్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ చీఫ్ గ్లోబల్ వ్యూహకర్త రుచిర్ శర్మ నేతృత్వంలోని బృందం లెక్క తేల్చింది. ఒక్క 2017లోనే దాదాపు 7000 మంది సంపన్నులు దేశం దాటేశారని ఈ అధ్యయనం తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షల మంది విదేశాలకు పరారీ
23వేల మంది బడా బాబులు దేశం దాటేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ వివిధ రూపాల్లో నష్టపోతోందని బృందం వివరించింది. మొత్తం దేశంలో ఉన్న సంపన్నుల్లో వలస పోయిన వారి సంఖ్య 2.1 శాతానికి సమానమని ఈ అద్యయనం తెలిపింది. దీంతో ప్రపంచంలోనే మరే ఇతర దేశాల్లోనూ వలస వెళ్లనంతగా బడా బాబులు భారత్ను వదిలేస్తున్నట్ట గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది సంపన్నుల కదలికలను అధ్యయనం చేసి ఈ మోర్గాన్ స్టాన్లీ ఈ వివరాలను తెలిపింది.
ఆర్థిక మోసాలపై పెరిగిన మోదీ సర్కార్ నిఘా
దేశం వదిలి ఆరు నెలలు అంతకంటే ఎక్కువ కాలం తిరిగి స్వదేశానికి రాకుండా.. అక్కడి నుంచి తమతమ దేశాల్లో వ్యాపారాలను చక్కబెడుతున్న వారి వివరాలను, కదలికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాక మోర్గాన్ స్టాన్లీ బృందం ఈ వివరాలను తెలిపింది. పన్నులు కఠినతరం చేయడం, నల్లధన నియంత్రణ చర్యలకు పదను, మోసాల వెలికితీత పెరగడం, మొండి బకాయిలు, ఆర్థిక మోసాలపై నిఘా పెరగడంతో చాలా మంది సంపన్నులు భారత్ వదిలి విదేశాలకు వలస వెళుతున్నట్లు తెలుస్తోందని ఈ అధ్యయనం వెల్లడించింది.
భారత్ తర్వాత ఫ్రాన్స్ నుంచి విదేశాలకు వలసలు ఎక్కువ
భారత్కు బైబై చెబుతున్న బడాబాబులు ఎక్కువగా బ్రిటన్, దుబాయి, సింగపూర్ దేశాలకు తమ మకాం మార్చేస్తున్నట్లు ఓ అధ్యయనంలో తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే విదేశాల వారు ఎక్కువగా ఆక్లాండ్, దుబాయి, మోట్రియల్, టెల్ అవైవ్, టొరంటోలలో తమ నివాసాలను మారుస్తున్నట్లు తెలుస్తోంది. భారత్తోపాటుగా అధిక పన్నుల వల్ల ఫ్రాన్స్లో కూడా సంపన్నుల వలసలు అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో గత ఏడాది బ్రిటన్ నుంచి కూడా అత్యధికంగా సంపన్నులు ఇతర ఐరోపా దేశాలకు తరలి పోయారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 2014 నుంచి ఇప్పటి వరకు చైనా నుంచి దాదాపు 38 వేల మంది సంపన్నులు దేశం దాటేశారని ఆ అధ్యయనం లెక్క తేల్చింది.
ఎయిర్సెల్కు ఇచ్చిన గ్యారంటీ నిలుపుకోవడంలో యాక్సిస్ బ్యాంక్ విఫలం
యాక్సిస్ బ్యాంక్ జారీ చేసే బ్యాంక్ గ్యారెంటీలను ఇకపై స్వీకరించబోమని టెలికాం మంత్రుత్వ శాఖ తెలిపింది. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్పై టెలికాం శాఖ ఈ ఆదేశాలు జారీ చేయడంతో మార్గెట్ వర్గాలు ఒక్క సారిగా కంగుతున్నాయి. గతంలో ఈ బ్యాంకు జారీ చేసిన పలు బ్యాంక్ గ్యారెంటీల విధి, విధానాలకు యాక్సిస్ బ్యాంక్ కట్టుబడకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా టెలికాం శాఖ తెలిపింది. ఈ నెల 16 టెలికాం శాఖ విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండంలో ఆదేశాలను జారీ చేసింది. ఎయిర్సెల్ గ్రూపునకు బ్యాంక్ గతంలో జారీ చేసిన బ్యాంక్ గ్యారెంటీని నిలుపుకోవడంతో యాక్సిస్ బ్యాంక్ విఫలమైందని పేర్కొంది.
ద్వైపాక్షిక సహకారమే మేలు: అసోచామ్
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పన్ను విధిస్తూ అమెరికా సర్కార్ అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసిన నేపథ్యంలో, కీలకమైన భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సహకారం ద్వారా ఎగుమతుల పెంపుపై దృష్టి సారించాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ సూచించింది. అమెరికా ఒక్క దేశంతోనే మనకు 150 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు సరికాదని పేర్కొంది. ఎందుకంటే మన దిగుమతులు అన్నీ కూడా సహజ అవసరాలేనని గుర్తు చేసింది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువని, ఈ దృష్ట్యా ప్రతిఘటనకు అవకాశం లేదన్నది. మన దిగుమతుల్లో చాలా వరకు అనివార్యమని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మన ఎగుమతులపై ప్రభావం పడితే ద్వైపాక్షిక సహకారంతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చానల్ను నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో ప్రభుత్వానికి సూచించింది.
పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులతో 150 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతుల బిల్లు 300 బిలియన్ డాలర్లుగా, దిగుమతుల బిల్లు 450 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని పేర్కొంది. దిగుమతుల్లోనూ ఒక వంతు చమురు ఉత్పత్తులేనని గుర్తు చేసింది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్ తదితర దేశీయంగా తగినంత ఉత్పత్తి లేని వస్తువులేనని తెలియజేసింది. అమెరికా అధిక పన్నులు వేసినందున స్టీల్ దిగుమతుల్లో ఉన్నట్టుండి పెరుగుదల ఉంటుందేమో దృష్టి పెట్టాలని సూచించింది. స్టీల్ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని ఉత్పత్తులను అధిక సుంకం పరిధిలోకి తీసుకొస్తామని, అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు వాణిజ్య యుద్ధానికి సైతం సిద్ధమేనని ఆయన పేర్కొనడం తెలిసిందే.