రైల్వే శాఖ కీలక నిర్ణయం: కొన్ని సెక్టార్లలో మార్చనున్న ఏసీ కోచ్లు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకొనే యోచనలో ఉంది. కొన్ని సెక్టార్లలో రాజధాని, దురంతో రైళ్లలో కోచ్లను మార్చాలని దేశీయ రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది.
ఇండియన్ రైల్వే కొన్ని కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని ఎక్స్ప్రెస్, దురంతో రైళ్లలో ఉన్న అన్ని ఏసీ-2 టైర్ కోచ్లను ఏసీ-3 టైర్ కోచ్లుగా మార్చాలని భావిస్తోంది. రాజధాని ఎక్స్ప్రెస్లో ఈ ఏడాది అన్ని ఏసీ-2 టైర్ టైర్ కోచ్లను తీసేసి, 250 ఏసీ-3 టైర్ కోచ్లను ఏర్పాటు చేయనుంది.
ఈ విషయాన్ని రైల్వే శాఖ ఉన్నతాధికారులు ధృవీకరించారు. ప్రతి రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో రెండు ఏసీ కోచ్లుంటాయి. అయితే దీన్ని కొందరు ప్యాసింజర్లు మాత్రమే బుక్ చేసుకొంటున్నారు. దీంతో రైల్వేకు ఆదాయం పడిపోతోంది.
రెవెన్యూ నష్టాలను పూడ్చుకొనేందుకుగాను ఈ మార్పులు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. మరో వైపు ఏసీ -3 టైర్ కోచ్లకు రైళ్ళలో భారీ ఎత్తున డిమాండ్ ఉంటుంది. దీంతో రైల్వే శాఖ లాభాల బాటలో పయనించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోచ్ల మార్పుతో పాటు రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ప్రెస్ల ఫ్లెక్సి ఫేర్ స్కీమ్ను కూడా సమీక్షించాలని దేశీయ రైల్వే నిర్ణయించింది.
దీని స్థానంలో రెంటల్ శ్లాబులను తీసుకురావాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ శ్లాబులతో ఫ్లెక్సి ఫేర్ స్కీమ్ను మరింత సరళతరం చేయనుంది. ఫ్లెక్సి ఫేర్ స్కీమ్ను 2016 సెప్టెంబర్లో దేశీయ రైల్వే లాంచ్ చేసింది.