శభాష్ పారేశమ్మ.. కరువుసీమలో పచ్చలహారం, ఐదేళ్ల కృషికి ఫలితం ఇదీ..
చిత్తూరు జిల్లాకు చెందిన పారేశమ్మ అసాధ్యం సుసాధ్య చేశారు. సాగు బరువైన చోట సిరులు పండేలా చేశారు. బీడువారిన భూములలో పచ్చదనం మొలకెత్తించారు. కరవు పల్లెలను సస్యశ్యామలం చేసి.. రైతుల్లో చైతన్యం నింపారు. దీంతో 16 గ్రామాల్లో పచ్చదనం మొక్కతొడిగింది. పారేశమ్మ చేసిన మంచి పనిని ఐక్యరాజ్య సమితి శభాష్ అని ప్రశంసించింది. చుక్క నీరు లేని చోట పంటలు పండుతాయా..? అని నిరాశపడ్డ రైతన్నల్లో చైతన్యాన్ని నింపి.. పంట మార్పిడి, నీటి సంరక్షణ, సాగులో పొదుపు పద్ధతుల గురించి అవగాహన కల్పించారు.
కరువుకు కేరాఫ్ అడ్రస్.. కానీ
చిత్తూరు జిల్లా పడమటి మండలాల్లోని చాలా గ్రామాలు కరువుకు కేరాఫ్ అడ్రస్గా ఉండేవి. 12వందల అడుగులు తవ్వితే కానీ చుక్కనీరు కనిపించేది కాదు. నీళ్లు లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి.. ఉపాధి కోసం బెంగళూరు వలస వెళ్లిపోయేవారు. నిరాశ నిండిన జీవితాల్లోకి వెలుగులు తీసుకొచ్చారు పారేశమ్మ. స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణలో 16 గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటసాగుపై రైతాంగానికి అవగాహన కల్పించారు.
పది చదివీ, ఐటీఐ చేసి
తంబళ్లపల్లె సమీపంలోని గోపిదిన్నె పారేశమ్మ స్వస్ధలం. పదో తరగతి చదివిన తర్వాత.. ఐటీఐ కూడా పూర్తి చేశారు. తొలుత చిన్నా ఉద్యోగాలు చేసి.. తరువాత ఫౌండేషన్ ఫర్ ఎకొలాజికల్ సెక్యూరిటీ సంస్థలో చేరారు. పర్యావరణ పునరుద్ధరణ, వనరుల పరిరక్షణ వంటి అంశాల్లో సంస్థ కృషి చేస్తోంది. ఆ విధానాలను పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించడం పారేశమ్మ విధి. ఇదీ ఆమెకు సంతోషం కలిగించింది. ఆ ప్రాంతంలో నీటి కష్టాలు ఆమెను కదిలించాయి. వ్యవసాయం వదిలేసిన రైతుల్లో తిరిగి వ్యవసాయం చేయించాలని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో 16 గ్రామాలకు అవగాహన కల్పించారు.
ఇష్టంగా మారిన కొలువు
కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ విధిలో భాగంగా తంబళ్లపల్లె మండలంలో గల 16 పంచాయతీలు కేటాయించారు. నూతన సాగు విధానాలు, జలసంరక్షణపై ఆ గ్రామాల్లో రైతులకు పారేశమ్మ చెబుతుండేవారు. అప్పటికే నిరాశలో పడిపోయిన రైతులు ఆమె మాటలు వినేవారు కాదు. కానీ వారికి పదే పదే చెప్పి తనవైపునకు తిప్పుకోగలిగారు. ఏ ప్రాంతంలో భూసారం ఎంత? నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి? ఏ పంట వేయచ్చు? ఇలా ఒక్కో అంశంపైనా అవగాహన తెచ్చుకొని, గ్రామస్తులకు అర్థమయ్యేలా చెప్పేవారు.
తగ్గిన నీటి అవసరం
ఉపాధి హామీ పనుల్లో నీటికుంటలు, చెరువులు నిర్మించుకునేలా పారేశమ్మ గ్రామస్తులను ప్రోత్సహించారు. టమోటా పంటకు బదులుగా.. నీటి అవసరం తక్కువగా ఉండే చిరుధాన్యాలు, వేరుసెనగ వంటి వైపు దృష్టి మళ్లించారు. దీంతో పంటకు నీటి అవసరం తగ్గింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. పంటతోపాటు తగ్గిన ఆదాయం కూడా రైతులు అందుకున్నారు. ఆమె కృషికి ఫలితం ఇప్పుడు అక్కడ కళకళలాడే పంటలు కనిపిస్తున్నాయి. పచ్చదనం వెనుక పారేశమ్మ ఐదేళ్ల కష్టం ఉంది. పారేశమ్మ సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి... ఉమెన్ వాటర్ ఛాంపియన్ అవార్డు ప్రదానం చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గౌరవం అందుకున్న ఏకైక మహిళ పారేశమ్మే కావటం గర్వకారణం.