కొన్ని ప్రాంతాలపై వివక్ష..కేసీఆర్పై రేవంత్ రెడ్డి విసుర్లు
సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే ఆ ప్రాంత ప్రజల కష్టాలు తీరేవని చెప్పారు. బీజేపీ ఫిరాయింపు రాజకీయాలను మునుగోడు ఉప ఎన్నికతో తిప్పి కొడతామన్నారు.
ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేసిన పార్టీలు.. ఇప్పుడు మళ్లీ మునుగోడు ప్రజల ముందుకు వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి నేతలు తమ పార్టీల్లోకి ఫిరాయిస్తారని టీఆర్ఎస్, బీజేపీ ఆశించాయని, కానీ కాంగ్రెస్ ఐక్యత ఆ రెండు పార్టీలకు చెంపపెట్టుగా మారిందని చెప్పారు. ఇదే మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
దేశాన్ని పాలించే అర్హత మోడీకి లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పి మరచిపోయారని తెలిపారు. ప్రధాని మోడీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొనేలా చేసి.. మోడీతో క్షమాపణ చెప్పించే వరకు పోరాడిందని వివరించారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎలాగైనా గెలవాలని బీజేపీ అనుకుంటోంది. మునుగోడులో పాగా వేయాలని టీఆర్ఎస్ పార్టీ వ్యుహరచన చేస్తోంది.