రిసార్టుల్లో డేంజరస్ గేమ్స్: బావిలో దూకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: నగర శివార్లలోని కొన్ని రిసార్టుల్లో ప్రమాదకర ఆటలు ప్రాణాలు తీస్తున్నాయి. వీకెండ్లలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులు వస్తుండటం పలు రిసార్టులు ప్రమాదకర గేమ్స్ ఆడిపిస్తూ తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయి. తాజాగా, ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఈ గేమ్స్ ఆడుతూ ప్రాణాలు కోల్పోవడం శోచనీయం.
గోధుమగూడలోని రిసార్ట్లో అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా డేంజర్ గేమ్ ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్గొనడానికి శనివారం సాయంత్రం రిసార్టుకు దాదాపు వంద మంది యువకులు వచ్చారు. అందరూ ఈ గేమ్ ఆడారు.
దూరంగా పడేసిన వస్తువును తీసుకురావడమే ఈ డేంజర్ గేమ్ టార్గెట్. ఈ క్రమంలో రిసార్ట్స్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టారు. దానిని వెతికి తీసుకువద్దామని సాయికుమార్ అనే యువకుడు బావిలో దూకాడు. అయితే, దురదృష్టవశాత్తు ఊపిరాడక బావిలోనే మృతి చెందాడు.
ఈ ఘటనతో సరదాగా సాగిన ఆట విషాదాంతమైంది. ఈ విషయం తెలుసుకున్న ఘటనా స్థలం చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కాగా, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే సాయికుమార్కు ఇటీవలే ఓ బాబు పుట్టినట్టు.. అతని స్నేహితులు తెలిపారు. కాగా, పలు రిసార్టులు అనుమతి లేకుండానే హైదరాబాద్ నగరంలో అడ్వెంచర్ క్లబ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.