నేను చెప్పిందే జరుగుతోంది, కేసీఆర్! 48 గంటల టైమిస్తున్నా, సిద్ధమా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గం అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి బంధువుల ఫాంహౌస్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎంత డబ్బు దొరికిందనేది చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఎన్నికల సంఘం అధికారి రజత్ కుమార్ గురువారం వెల్లడిస్తారు.
నందమూరి సుహాసినికి వైసీపీ భారీ దెబ్బ: ఓడితే ఏపీ సీఎంగా.. ఇదీ జగన్ లెక్క!
ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి బుధవారం స్పందిస్తూ.. కొడంగల్ నియోజకవర్గంలో తనను ఓడించడం సాధ్యం కాదని తెలిసినా ముఖ్యమంత్రి (ఆఫద్ధర్మ) కేసీఆర్ మొండిగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని తాను చెబుతూనే ఉన్నానని అన్నారు.
నిజాయితీ నిరూపించుకుంటావా
మరోవైపు, ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో మాట్లాడుతూ.. సత్యహరిశ్చంద్రుడిని అని ప్రగల్బాలు పలుకుతున్న కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకునేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ప్రతి కాంట్రాక్టులో కేసీఆర్కు ఆరు శాతం కమీషన్ వెళ్తోందని ఆరోపించారు.
ప్రమాణం చేస్తావా కేసీఆర్
తాను ఎందులోను కమీషన్ తీసుకోలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి గుండంలో మునిగి, గుడిలో ప్రమాణం చేసేందుకు రావాలని కేసీఆర్కు రేవంత్ సవాల్ చేశారు. 48 గంటల్లోగా సవాల్ స్వీకరించకుంటే తప్పును ఒప్పుకొన్నట్లేనని చెప్పారు. కేసీఆర్కు కుటుంబానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరే పని లేదన్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడితే వంద రోజుల్లో యువతకు లక్ష ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమే అన్నారు. భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు.
ఎన్ని కష్టాలు వచ్చినా సోనియా తెలంగాణ ఇచ్చారు
రాష్ట్రంలో తొలి మున్సిపాలిటీ భువనగిరిలో కనీస సౌకర్యాలు లేకుండా చేసిన పైళ్ల శేఖర్ రెడ్డిని ఓడించాలని రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తెలంగాణ పోరాటానికి నాంది పలికిన ఖిల్లా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు.
సోనియాకు కృతజ్ఞత
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాల్సి ఉందని రేవంత్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించి ఆమెకు బహుమతిగా ఇవ్వాలన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే 90 శాతం రైతులకు మేలు జరుగుతుందన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామన్నారు.