సుభిక్షంగా తెలంగాణ: రాష్ట్రం ఏర్పడి నేటికి 8 ఏళ్లు, సంక్షేమం..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటికి ఎనిమిదేళ్లు. ఆంధ్ర వలసవాద పాలన నుంచి తెలంగాణ గడ్డకు విముక్తి కలిగిన రోజు.. స్వ రాష్ట్రం కోసం తొలి దశ, మలి దశ పోరాటాలు జరిగాయి. విద్యార్థుల బలిదానాలు ఇచ్చారు. రాజకీయ పార్టీల మద్దతుతో.. కేంద్రంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం దిగి వచ్చింది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను ఓ సారి గుర్తుచేసుకుందాం.
తొలి దశ ఉద్యమం
స్వ రాష్ట్రం కోసం 1969లో ఉద్యమం కొనసాగింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం పీక్కి చేరింది. వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేశారు. అప్పటి ప్రభుత్వం హామీలతో తెలంగాణ ఏర్పాటు వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో మలిదశ ఉద్యమం మొదలైంది. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం కోసం పోరాటాలే జరిగాయి. ఆ పార్టీ పదవులను తృణప్రాయంగా వదులుకుంది. జనం కూడా అదేవిధంగా ఆదరించారు. శ్రీకాంతాచారి లాంటి వారు ఆత్మబలిదానం చేసుకున్నారు.
రాష్ట్ర ఏర్పాటు ప్రకటన
ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి అప్పటి ప్రభుత్వం ప్రకటన చేసింది. తర్వాత 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు బీజేపీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది.
విభజన పరిణామం..
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు) ప్రవేశపెట్టింది.2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మూడు రోజులపాటు హైదరాబాద్ పబ్లిక్గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతి వేదికల్లో కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్ఫిల్మ్ల స్క్రీనింగ్ వంటి పలు కార్యక్రమాలు జరిగాయి.
నీళ్లు, నియామకాలు, నిధులు
ఇక అప్పటినుంచి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వ రాష్ట్రం ట్యాగ్ లైన్ నీళ్లు.. ఇందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. రాష్ట్రంలో గల ప్రతీ చివరి ఎకరానికి నీరు అందజేయడమే తమ లక్ష్యం అని కేసీఆర్ సర్కార్ చెబుతుంది. నియామకాలు.. కూడా భారీగానే చేపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతు బందు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీ, దళిత బంధు లాంటి ప్రతిష్మాత్మక పథకాలను ప్రవేశపెడుతుంది