ఓ సారూ.. సోయిలోకి రా... ఆరోగ్య శ్రీలో చేర్చు.. షర్మిల నిప్పులు
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణలో మరికొన్ని గంటల నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే కరోనా బారిన పడిన సామాన్యుడి సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. ఇదే అంశాన్ని వైఎస్ షర్మిల ప్రస్తావించారు. కేసీఆర్ లక్ష్యంగా విమర్శలను ఎక్కుపెట్టారు. తనదైన శైలిలో విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్పై ట్విటర్లో వైఎస్ షర్మిల విరుచుపడ్డారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చమని ఆమె కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు, మృతులు పెరుగుతుండటంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా పెట్టడు.. అడుక్కు తిననీయడు అని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు, కేంద్ర ఆయుష్మాన్ భారత్లో చేరడు. దొర నిర్ణయాలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్కి దోచిపెడుతున్నవి అని ఫైరయ్యారు.
హైదరాబాద్ చుట్టూ నాలుగు దిక్కులా ఆసుపత్రులేనని చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి సరిపడా బడ్జెట్ ఇచ్చేది మాత్రం లేదన్నారు. ఉస్మానియా, గాంధీ, టిమ్స్, నిమ్స్లకే ఊపిరి సక్కగా అందట్లేదు అని గుర్తుచేశారు. ఇక అందులో చేరిన వారికి వైద్యం గాలిలో దీపం చందంలా మారిందని చెప్పారు. కేసీఆర్ సారూ.. ఇకనైనా సోయిలోకి రా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చు అని షర్మిల విమర్శించారు.