2 రోజుల్లో రూ.1000 కోట్లు, 100 కోట్ల మద్యం విక్రయాలతో యూపీ టాప్, ఏపీలో రూ.68 కోట్లు..
లాక్డౌన్ వల్ల మందుబాబులకు చుక్కలు కనిపించాయి. చుక్క లేక క్షణమొక యుగంలా గడిపారు. అయితే గ్రీన్, ఆరంజ్ జోన్లలో వైన్ షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో సోమవారం నుంచి లిక్కర్ ప్రియులు వైన్ షాపుల వద్ద బారులుతీరారు. ఒకటి కాదు రెండు కాదు 40 రోజుల నుంచి మందు లేకపోవడంతో ఒక్కొక్కరు తమకు సరిపడనంత మందును కొనుగోలు చేశారు. బెంగళూరులో ఒకతను రూ.50 వేల వరకు బిల్లు చేశారు. అయితే గత రెండురోజుల నుంచి దేశవ్యాప్తంగా లిక్కర్ ద్వారా రూ.1000 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ ఇలా మందు కొనుగోలు చేయలేదు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్.. లిక్కర్ విక్రయాల్లో కూడా టాప్ ప్లేసులో ఉంది. రెండురోజుల్లో రూ.100 కోట్ల ఆదాయం సమకూరింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా రూ.68 కోట్లు ఆదాయం వచ్చింది. కానీ చాలా వైన్ షాపుల ముందు జనాలు సామాజిక దూరం పాటించడం మరచిపోయారు. క్యూ లైన్ చాంతడంత కూడా ఉంది. మరికొందరు మందు లభించడంతో ఎగిరి గంతేశారు. కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించాయి.
లిక్కర్ షాపుల వద్ద రద్దీని ముందే ఊహించిన ఛత్తీస్ గఢ్, పంజాబ్ రాష్ట్రాలు.. మద్యం హోం డెలివరీ చేస్తోంది. దీంతో వైరస్ నివారణకు కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టు అవుతంది. మందుబాబుల వీక్ నెస్ గ్రహించిన కొన్ని రాష్ట్రాలు మద్యం ధర పెంచేశాయి. ఈ జాబితాలో ఢిల్లీ ముందువరసలో ఉంది. లిక్కర్పై కరోనా ఫీ పేరుతో సెస్ వసూల్ చేస్తోంది. 70 శాతం సెస్ వేయడంతో రూ.1000 బాటిల్.. రూ.1700కు లభించనుంది.