మరో మంకీపాక్స్ కేసు.. మరింత ముమ్మరంగా తనిఖీలు, కేంద్రం ఆదేశం
దేశంలో మరో మంకీ పాక్స్ కేసు వెలుగుచూసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. విమానాశ్రయంలో పకడ్బందీగా తనిఖీ చేయాలని అధికారులకు స్పష్టంచేసింది. విదేశాల నుంచి ఇండియా వచ్చే ప్రయాణికుల విషయంలో ఎయిర్ పోర్టులు, పోర్టుల వద్ద కఠినంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించింది. కేరళలో సోమవారం రెండో మంకీపాక్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. పోర్టులు, ఎయిర్పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పోర్టులు, ఎయిర్పోర్టుల వద్ద ఇండియా వచ్చే ప్రయాణికులకు కచ్చితమైన హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇతర అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనుమానిత ప్రయాణికులు ఐసోలేషన్లో ఉంటూ, తగినంత దూరం పాటించేలా, దగ్గరలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. గతంలో ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలోనే హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించేవారు. ఇప్పుడు ఇతర దేశాల ప్రయాణికుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి, పరీక్షలకు పంపే ఏర్పాట్లు చేశారు. అన్ని రాష్ట్రాలు, ఎయిర్పోర్టులు, పోర్టులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.