అల్వార్ ఆలయాల కూల్చివేత దుమారం.. ఆ 3 తిరిగి నిర్మిస్తామని ప్రకటన
అల్వార్లో ఆలయం కూల్చివేతపై దుమారం కొనసాగుతోంది. బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ కూల్చివేసిన ఆలయాలు తిరిగి నిర్మిస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు అల్వార్ జిల్లా పరిపాలనా విభాగం స్పష్టంచేసింది. ఆ మూడు ఆలయాలు పున:నిర్మిస్తామని పేర్కొంది.
రోడ్డు విస్తరణలో భాగంగా అల్వార్ జిల్లాలో గల రాజ్గడ్లో ఆలయాలను కూల్చివేశారు. సారాయి మొహల్లలో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని స్థానిక అధికారులు కూల్చివేశారు. ఆలయంతోపాటు 86 దుకాణాలు, ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. నగర అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్లో భాగంగా కూల్చివేత చేపట్టారు. కానీ దీనిపై స్థానికుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో తిరిగి నిర్మిస్తామని అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ సునీత పంకజ్ తెలిపారు.
పురాతన శివాలయం సహా మరో రెండు ఆలయాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనిపై హిందూ సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలను కూల్చివేయడంపై బీజేపీ నాయకులు కూడా మండిపడ్డారు. కూల్చివేతలకు సంబంధించి బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. శికార్ ఎంపీ స్వామి సుమేధానంద్ మూడురోజులు పర్యటించి నివేదిక రూపొందిస్తారు. తర్వాత రాజస్థాన్ బీజేపీ చీఫ్ సతీష్ పూనియాకు అందజేస్తారు. కమిటీలో చంద్రకాంత మెఘవాల్, రాజేంద్ర సింగ్ షెకావత్, బ్రజ్ కిశోర్ ఉపాధ్యాయ్, భవానీ మీనా ఉన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా 18వ తేదీన 85 మంది హిందువుల షాపులు, పక్కా ఇళ్లను కూల్చివేశారు.