తగిని శాస్తి జరిగింది! రైల్లోంచి దికి కికి ఛాలెంజ్, విన్యాసాలు: కోర్టు శిక్షలు వేసిందిలా!
Recommended Video
ముంబై: కికి ఛాలెంజ్ పేరుతో విన్యాసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దంటూ ఓ వైపు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా.. కొంతమంది యువత మాత్రం తమ పైత్యాన్ని వీడటం లేదు. వాహనాల్లోంచి దిగ వాహనం నడుస్తుండగానే డ్యాన్సులు చేస్తూ వీడియోలు తీసుకుంటున్నారు.
తాజాగా, మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో ముగ్గురు యువకులు కికిఛాలెంజ్ పేరిట కదులుతున్న రైలు పక్కన చిందిలేశారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వీరికి తగిన శిక్ష వేసింది.
రైల్లోంచి దిగి చిందులు
ఆ వివరాల్లోకి వెళితే.. నిషాంత్ షా, ధ్రువ్ షా, శ్యామ్ శర్మ అనే ముగ్గురు యువకులు కికి ఛాలెంజ్ పేరిట కదులుతున్న రైల్లో నుంచి కిందికి దిగి డ్యాన్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఫ్లాట్ ఫాంపై చిందులేస్తూ విన్యాసాలు చేశారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అది వైరల్గా పోలీసులకు చిక్కింది.
ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగి ఆ ముగ్గురు యువకులను అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురు యువకులు అంబులెన్స్ దగ్గర కూడా కికి ఛాలెంజ్ చేసిన వీడియోను కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి విసాయ్ ప్రాంతంలోని రైల్వే కోర్టులో హాజరుపర్చారు.
యువకులకు ఈ శిక్షలు విధించిన కోర్టు..
విచారించిన రైల్వే కోర్టు.. ముగ్గురు యువకులకు శిక్ష విధించింది. ఈ వారంలో మూడు రోజులపాటు విసాయ్ రైల్వే స్టేషన్ను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాక, ఇలాంటి విన్యాసాలు చేస్తే ప్రమాదాల బారిన పడతారంటూ ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా సూచించింది.
అంతా వీడియో తీసి..
కాగా, ముగ్గురు యువకులు ఈ రెండు శిక్షలను పాటించే సమయంలో వీడియో తీసి దాన్ని కోర్టుకు అందజేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు, మ. 3గంటల నుంచి 5గంటల వరకు ఈ రెండు టాస్క్లు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. ఆ వీడియోలను చూసిన తర్వాత ఇంకేదైనా శిక్ష వేయాలా? అనేదానిపై నిర్ణయం చెబుతామని కోర్టు పేర్కొంది.