వైవాహిక జీవితంలో కలహాలు..? సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మహత్య ...
శ్రీనగర్ : వైవాహిక సమస్యలో.. పని ఒత్తిడికి గురయ్యాడో తెలియదు కానీ ఓ సీఆర్పీఎఫ్ అధికారి బలవన్మరణం చెందారు. కశ్మీర్లోని అనంత్నాగ్ 40 బెటాలియన్లో పనిచేస్తున్న ఎం అరవింద్ (34) అనే అసిస్టెంట్ కమాండెంట్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే అరవింద్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలే ఆత్మహత్యకు దారితీసి ఉంటాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ ఘటనపై ఆర్మీ అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ అరవింద్ ఆత్మహత్య కలకలం రేపింది. ఇవాళ ఆయన తన తూపాకీతో పాయింట్ బ్లాంకులో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నాడు. అనంత్నాగ్లోని సదర్లో గల తన ఇంటిలో కాల్చుకోవడం అనుమానాలకు దారితీసింది. అరవింద్ సెలవులో తమిళనాడు వెళ్లి .. ఈ నెల 14న విధుల్లో చేరారు. ఆ తర్వాత వారం రోజులకు అరవింద్ భార్య కూడా అనంత్నాగ్ వచ్చారు.
వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయని .. ఇద్దరూ గొడవపడేవారని తెలుస్తోంది. అరవింద్ ఆత్మహత్యపై అధికారులు విచారణకు ఆదేశించారు. అతని మృతదేహాన్ని స్వస్థలానికి తరలించినట్టు పేర్కొన్నారు. అయితే అరవింద్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్మీ అధికారులు కొట్టిపారేశారు. ఆయన ఫ్యామిలీకి సంబంధించి సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం జరుగుతుందని తోసిపుచ్చారు. అరవింద్, అతని భార్య ఇతరులతో సహజీవనం చేయడమనే ప్రచారం సత్యదూరమని కొట్టిపారేశారు.