7th pay commission : కేంద్ర ప్రభుత్వోద్యోగులకు తీపి కబురు .. డీఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచడానికి ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. డీఏను గత ఏడాది నిలిపివేసిన తరువాత పెంచడానికి కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకటిన్నర సంవత్సరాల కు పైగా డిఏ బకాయిలు కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది.
డియర్నెస్ అలవెన్స్ ప్రయోజనాలపై నిర్ణయం తీసుకున్న కేంద్రం
ఏడవ సెంట్రల్ పే కమిషన్ (7 వ సిపిసి) కింద డియర్నెస్ అలవెన్స్ ప్రయోజనాలు జూలైలో పునరుద్ధరించబడతాయని ఇప్పటికే అనేక వార్తలు వెలుగులోకి రాగా అందుకు తగ్గట్టుగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపును కేబినెట్ ఆమోదించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నుంచి పెరిగిన డీఏ ప్రయోజనం లభిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. పెరిగిన డీఏ పొందడానికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నప్పటికీ తాజా నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1, 2021 నుండి బకాయిలు వచ్చే అవకాశం ఉంది.
సీసీఈఏ సమావేశంలో కేంద్ర ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్
ఇక ఈ నిర్ణయం కేబినెట్ ఆమోదం పొందటానికి ముందే కనీసం మూడు డిఎ వాయిదాలు చెల్లించాల్సి ఉంది . గత సంవత్సరానికి సంబంధించి రెండు మరియు ఈ సంవత్సరం నుండి ఒకటి పెండింగ్లో ఉన్న మూడు విడతల్లో భాగంగా 11 శాతం డీఏ పెంపు ఆమోదం పొందింది. ఈరోజు జరిగిన సీసీఈఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెసిఎం నేషనల్ కౌన్సిల్ ప్రకారం సెప్టెంబరు జీతంలో చివరి మూడు విడతలు అందించనున్నారు.
ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం పదోన్నతి, జీతం పెంపు
డీఏ వాయిదాలతో పాటుగా ఉద్యోగులకు జూలై, ఆగస్టు లో ఉన్న బకాయిలు కూడా లభిస్తాయి. ఏడవ వేతన సంఘం సిఫారసుల ప్రకారం పదోన్నతి, జీతం పెరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ ఫైల్స్ కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతంతో పాటు పదోన్నతి కూడా లభిస్తోంది . ఇక ఈ అప్రైజల్ అసెస్మెంట్ ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పినట్టయ్యింది.