వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా గాంధీ ప్రాణాలు నిలిపేందుకు 80 బాటిళ్ల రక్తం ఎక్కించారు.. ఆ తర్వాత..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇందిరా గాంధీ

ఇందిరా గాంధీ స్మృతుల్లో భువనేశ్వర్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. అయితే, వాటిలో ఎక్కువ భాగం చేదు జ్ఞాపకాలే.

ఆమె తండ్రి జవహర్‌లాల్ నెహ్రూ ఇదే నగరంలో మొట్టమొదటిసారి తీవ్రంగా జబ్బుపడ్డారు. అది చివరకు 1964లో ఆయన మరణానికి దారితీసింది. ఈ నగరంలోనే 1967లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమెపై ఒక వ్యక్తి రాయితో దాడి చేశాడు. దాంతో ఆమె ముక్కు ఎముక విరిగిపోయింది.

1984 అక్టోబర్ 30 మధ్యాహ్నం ఇందిరా గాంధీ చేసిన చివరి ప్రసంగాన్ని ఎప్పటి లాగే ఆమె సమాచార సలహాదారు హెచ్‌వై శారదాప్రసాద్ తయారు చేశారు.

అయితే ఆరోజు ఆమె ఉన్నట్టుండి ముందుంగా తయారు చేసుకున్న ప్రసంగ పాఠం కాకుండా సొంతంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఆమె మాట్లాడే తీరులోనూ మార్పు కనిపించింది.

ఇందిర ప్రసంగం ఇలా సాగింది: "నేనీ రోజు ఇక్కడున్నాను. రేపు బహుశా ఇక్కడ ఉండకపోవచ్చు. నేను ఉంటానా, ఉండనా అన్న దానిపై నాకేమీ బాధ లేదు. నేను సుదీర్ఘ కాలమే జీవించాను. నేను ప్రజాసేవలో నా జీవితాన్ని గడిపినందుకు గర్వపడుతున్నా. నేను నా చివరి శ్వాస వరకూ సేవ చేస్తూనే ఉంటాను. నేను చనిపోతే నా ఒక్కో రక్తం బొట్టూ దేశాన్ని పటిష్టం చేయడానికి తోడ్పడుతుంది."

అప్పుడప్పుడు విధి.. మాటల రూపం ధరించి రానున్న కాలం దిశగా సంకేతాలిస్తుందేమో.

ప్రసంగం తర్వాత ఆమె రాజభవన్ చేరుకున్నారు. "మీరు మీ మరణం గురించి ప్రస్తావించి నన్ను ఓ కుదుపు కుదిపారు" అని గవర్నర్ బిశ్వంభర్‌నాథ్ ఆమెతో అన్నారు.

తాను నిజాయితీగా వాస్తవాలను మాట్లాడానని ఇందిర అన్నారు.

రాత్రంతా నిద్ర పోలేదు

ఆ రాత్రి దిల్లీకి చేరుకునేసరికి ఇందిర బాగా అలసిపోయారు. ఆ రోజు రాత్రి ఆమె చాలా తక్కువ సేపు నిద్రపోయారు.

ముందు గదిలో పడుకున్నసోనియా ఉదయం 4 గంటల సమయంలో ఆస్థమా మందు వేసుకోవడం కోసం బాత్రూంకు వెళ్లినప్పుడు ఇందిర మెలకువతోనే ఉన్నారు.

ఇందిర కూడా తన వెనుకే బాత్రూం వరకూ వచ్చారనీ, మందు వెదకడంలో తనకు సహాయం చేశారనీ సోనియా గాంధీ తన పుస్తకం 'రాజీవ్'లో రాశారు.

మళ్లీ ఇబ్బంది కలిగితే తనను పిలవమనీ, తాను మెలకువతోనే ఉంటానని ఇందిర తనకు చెప్పారని సోనియా రాశారు.

పీటర్ ఉస్తీనోవ్‌

తక్కువ అల్పాహారం

ఉదయం ఏడున్నరకల్లా ఇందిర తయారయ్యారు. ఆ రోజు ఆమె నల్లటి అంచున్న కాషాయ రంగు చీర కట్టుకున్నారు.

ఆ రోజు మొదటి అపాయింట్‌మెంట్ పీటర్ ఉస్తీనోవ్‌తో. ఆయన ఇందిరా గాంధీపై ఒక డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఒక రోజు ముందు జరిగిన ఒడిశా పర్యటనలో కూడా ఉస్తీనోవ్ ఆమెను షూట్ చేశారు.

మధ్యాహ్నం ఆమె బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్ కాలెఘన్‌నూ, మిజోరం నాయకుడొకరినీ కలవాల్సి ఉంది. ఆ రాత్రి ఆమె బ్రిటన్ రాకుమారి యాన్‌కు విందు ఇవ్వాల్సి ఉంది.

అల్పాహారం తర్వాత మేకప్ మ్యాన్ ఆమె ముఖంపై పౌడర్, బ్లషర్ అద్దుతుండగా డాక్టర్ కేపీ మాథుర్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చూడడానికి ఆయన రోజూ వచ్చే సమయం అదే.

ఆమె డాక్టర్ మాథుర్‌ను లోపలికి పిలిచి అక్కడే మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అవసరానికి మించి మేకప్ వేసుకుంటారనీ, ఆయనకు 80 ఏళ్లొచ్చినా జుత్తు నల్లగానే ఉంటుందంటూ మాథుర్‌తో జోక్ చేశారు.

ఇందిరా గాంధీ

ఒక్కసారిగా కాల్పులు

తొమ్మిది గంటల 10 నిమిషాలకు ఆమె బయటికి వచ్చినప్పుడు ఎండ తీవ్రంగా ఉంది. ఆమెపై ఎండ పడకుండా ఉండేందుకు ఓ సైనికుడు నారాయణ్ సింగ్ నల్లరంగులో ఉన్న గొడుగును పట్టుకొని ఆమె పక్కన నడుస్తున్నారు.

ఆమెకు కాస్త వెనకాల ఆర్కే ధావన్, ఇందిరా గాంధీ వ్యక్తిగత సహాయకులు నాథు రామ్ ఇంకాస్త వెనుక ఉన్నారు.

అందరికన్నా వెనుక ఆమె ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్ రామేశ్వర్ దయాళ్ ఉన్నారు.

అప్పుడే ఆమె ముందు నుంచి ఓ సహాయకుడు టీ సెట్ పట్టుకొని అక్కడి నుంచి వెళుతుంటే ఇందిరా గాంధీ అతన్ని పిలిచి ఉస్తీనోవ్‌ కోసం మరో టీ సెట్ తీసుకురమ్మని చెప్పారు.

ఇందిరా గాంధీ అక్బర్ రోడ్ వైపు నుంచి వికెట్‌ గేట్ వైపు వెళుతున్నప్పుడు ఆమె ధావన్‌తో మాట్లాడుతున్నారు.

ధావన్ ఇందిరా గాంధీతో మాట్లాడుతూ, మీరు చెప్పిన విధంగా యెమెన్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతిని సాయంత్రం 7గంటల కల్లా వచ్చేయాలని చెప్పానని అన్నారు.

దిల్లీలోని పాలం రోడ్డులో ఉన్న ఎయిర్ పోర్టు నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇందిరా గాంధీకి బ్రిటన్ రాజకుమారి యాన్‌తో విందులో పాల్గోవాల్సి ఉందని చెప్పానని అన్నారు.

అకస్మాత్తుగా అక్కడ డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు బియాంత్ సింగ్ రివాల్వర్ తీసి ఇందిరా గాంధీపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆమె కడుపులో దిగింది.

ఆమె ముఖాన్ని కాపాడుకునేందుకు కుడిచేతిని అడ్డుపెట్టారు కానీ అప్పుడే బియాంత్ సింగ్ పాయింట్ బ్లాంక్ రేంజిలో మరో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆమె భుజం, గుండె, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి.

ఇందిరా గాంధీ

కాల్చేయ్.. కాల్చేయ్

అక్కడి నుంచి ఐదడుగుల దూరంలో సత్వంత్ సింగ్ తన థామ్సన్ ఆటో కార్బైన్ గన్ పట్టుకొని అక్కడే నిలబడి ఉన్నాడు.

ఇందిరా గాంధీ కిందపడుతున్నప్పుడు అతను దిగ్ర్భాంతి చెంది అక్కడి నుంచి కదలలేకపోయారు.

అప్పుడే బియాంత్ సింగ్ అతనిని కాల్పులు జరపమని గట్టిగా అరిచాడు.

సత్వంత్ సింగ్ వెంటనే తన థామ్సన్ ఆటో కార్బైన్‌లో ఉన్న మొత్తం 25 బుల్లెట్లను ఇందిరా గాంధీ శరీరంలోకి దించేశాడు.

బియాంత్ సింగ్ మొదటిసారి కాల్పులు జరిపిన 25 సెకండ్ల తర్వాత కూడా అక్కడున్న భద్రతా దళాలు స్పందించలేదు.

సత్వంత్ కాల్పులు జరపడం మొదలుపెట్టిన తర్వాత అందరికన్నా వెనకాల నడుస్తూ వచ్చిన రామేశ్వర్ దయాళ్ ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టారు.

కానీ ఆయన ఇందిరా గాంధీ దగ్గరకు చేరుకోక ముందే తొడ, కాళ్లపై సత్వంత్ జరిపిన కాల్పులతో కిందపడిపోయారు.

ఇందిరా గాంధీ వ్యక్తిగత సహాయక సిబ్బంది ఆమె ఛిద్రమైన శరీరాన్ని చూసి కూడా ఒకరినొకరు ఆదేశాలిచ్చుకున్నారు.

అక్బర్ రోడ్‌లో ఉండే ఓ పోలీస్ అధికారి దినేష్ కుమార్ భట్ ఎందుకీ అరుపులు కేకలు వస్తున్నాయని బయటికి వచ్చారు.

ఇందిరా గాంధీ

అంబులెన్స్ లేదు

అప్పుడే బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ తమ ఆయుధాలను కింద పడేసి ఇలా అన్నారు "మేమేం చేయాలనుకున్నామో చేసేశాం. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి."

అప్పుడే నారాయణ్ సింగ్ ముందుకొచ్చి బియాంత్ సింగ్‌ను కింద పడేశాడు. దగ్గరలో ఉన్న ఓ రూమ్ నుంచి ఐటిబీపీ దళాలు పరిగెత్తుకొచ్చి సత్వంత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నాయి.

ఎప్పుడూ అక్కడ ఓ అంబులెన్స్ ఉండేది. కానీ, ఆ రోజు డ్రైవర్ ఎందుకో రాలేదు. అప్పుడే ఇందిరా గాంధీ రాజకీయ సలహాదారు మఖన్ లాల్ ఫోతేదార్ కారు తీయండని అరుస్తూ అన్నారు.

ఇందిరా గాంధీని ఆర్కే ధావన్, భద్రతా అధికారి దినేష్ ఇద్దరూ అక్కడి నుంచి లేపి తెల్లటి అంబాసిడర్ కారు వెనుక సీటులో పడుకో బెట్టారు.

ముందు సీట్లో ధావన్, ఫోతేదార్, డ్రైవర్ ముగ్గురూ కూర్చున్నారు. కారు కాస్త ముందుకెళ్లిన తర్వాత సోనియా గాంధీ చెప్పుల్లేకుండా తన డ్రెస్సింగ్ గౌన్‌తోనే మమ్మీ- మమ్మీ అని అరుస్తూ పరిగెత్తుకుని వచ్చారు.

ర‌క్త‌పు మడుగులో ఉన్న ఇందిర తలను సోనియా గాంధీ తన ఒడిలో పెట్టుకున్నారు. కారు వేగంగా ఎయిమ్స్ వైపు వెళ్ళింది.

నాలుగు కిలోమీటర్ల ఈ ప్రయాణంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. సోనియా గాంధీ గౌన్ ఇందిరా గాంధీ రక్తంతో తడిసిపోయింది.

ఇందిరా గాంధీ

స్ట్రెచర్ లేదు

కారు తొమ్మిది గంటల 32 నిమిషాలకు ఎయిమ్స్‌కు చేరింది. అక్కడ ఇందిరా గాంధీ ఓఆర్‌హెచ్ నెగెటివ్ గ్రూపు రక్తం సరిపడా ఉంది.

కానీ సఫ్దర్ గంజ్ రోడ్ నుంచి ఎవరూ ఎయిమ్స్‌కు ఫోన్ చేసి ఇలా ఇందిరా గాంధీని తీసుకొస్తున్నారని చెప్పలేదు.

ఎమర్జెన్సీ వార్డు గేటు తెరిచి ఇందిరా గాంధీని కారు నుంచి కిందకి దింపేందుకే మూడునిమిషాల సమయం పట్టింది. అప్పుడు అక్కడ ఒక్క స్ట్రెచర్ కూడా అందుబాటులో లేదు.

ఎలాగోలా ఒక స్ర్టెచర్‌ను ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీని కారు నుంచి బయటకు తీసుకొస్తున్నపుడు అక్కడున్న డాక్టర్లు కంగారు పడ్డారు.

వెంటనే వాళ్ళు ఎయిమ్స్ సీనియర్ కార్డియాలజిస్టుకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే డాక్టర్ గులేరియా, డాక్టర్ ఎంఎం కపూర్, డాక్టర్ ఎస్ బలరాం అక్కడ ప్రత్యక్షమయ్యారు.

ఇందిరా గాంధీ

ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లో ఇందిరా గాంధీ గుండె ఎక్కడో పనిచేస్తున్నట్లుగా చూపిస్తోంది కానీ పల్స్ రేట్‌ మాత్రం చూపించడం లేదు.

ఆమె కళ్ళలో గుడ్లు బయటికొచ్చేసినట్లుగా ఉన్నాయి. అది ఆమె మెదడుకు గాయమైందనే సంకేతాలిస్తుంది.

ఒక డాక్టరు ఆమె ఊపిరితిత్తులకు ఆక్సిజన్ చేరాలని, ఆమె మెదడు పనిచేయాలని ఆమె నోటి ద్వారా శ్వాస నాళంలోకి ఒక ట్యూబు వేశాడు.

ఇందిరా గాంధీ శరీరంలోకి 80 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించారు. అది ఆమె శరీరంలో ఉన్న రక్తానికి ఐదు రెట్లు ఎక్కువ.

"ఆమెను చూసిన వెంటనే ఆమె ఇక లేరని అనుకున్నాను. దాన్ని నిర్ధారించేందుకు ఈసీజీ స్కానింగ్ చేశాం. అప్పుడే అక్కడున్న ఆరోగ్యశాఖ మంత్రి శంకరానంద్‌ను ఇప్పుడేం చేద్దాం అని అడిగా. ఆమె మరణించారని ప్రకటించాలా? అని అడిగితే ఆయన వద్దన్నారు. ఆ తర్వాత ఆమెను ఆపరేషన్ థియేటర్‌లో తీసుకెళ్లాం" అని డాక్టర్ గులేరియా తెలిపారు.

ఇందిరా గాంధీ

గుండె మాత్రమే సురక్షితం!

డాక్టర్లు ఆమె శరీరాన్ని హార్ట్ అండ్ లంగ్ మెషీన్‌పై పెట్టారు. ఈ మెషీన్ వల్లే ఆమె రక్త ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుండి 31 డిగ్రీలకు పడిపోయింది.

ఆమె చనిపోయారని తెలిసినా ఎయిమ్స్ ఎనిమిదో అంతస్తుపై ఉన్న ఆపరేషన్ థియేటర్‌లో ఆమెను తీసుకెళ్లారు.

కాల్పులతో ఆమె కాలేయంలో కుడి భాగం ఛిద్రమైందని నిర్ధరించారు. ఆమె పెద్ద ప్రేగులో దాదాపు 12 రంధ్రాలయ్యాయి. చిన్న ప్రేగు కూడా దాదాపు దెబ్బతింది.

ఓ ఊపిరితిత్తిలోకీ బుల్లెట్ దూసుకెళ్లింది. బుల్లెట్లతో ఆమె వెన్నెముక కూడా దెబ్బతింది. కేవలం ఆమె గుండె మాత్రమే సురక్షితంగా ఉంది.

ఇందిరా గాంధీ

డ్యూటీలో వారే

ఇందిరా గాంధీపై కాల్పులు జరిపిన నాలుగు గంటల తర్వాత.. దాదాపు మధ్యాహ్నం రెండు గంటల 23 నిమిషాలకు ఇందిర ఇక లేరని ప్రకటించారు.

కానీ ప్రభుత్వ ప్రసార చానెళ్లు మాత్రం సాయంత్రం ఆరు గంటల తరువాత కూడా ఇందిరా గాంధీ మరణం గురించి ప్రకటించలేదు.

ఇందిరా గాంధీపై ఇలాంటి దాడి జరగొచ్చనే విషయంపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ముందే ఆందోళన వ్యక్తం చేశాయని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర రాసిన ఇందర్ మల్హోత్రా తెలిపారు.

సిక్కు భద్రతా సిబ్బందిని మొత్తం ఆమె ఇంటి నుంచి తీసేయాలని ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు సిఫారసు కూడా చేశాయి.

కానీ దీనికి సంబంధించిన ఫైలు ఇందిరా గాంధీ వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ఆగ్రహించి "ఆరింట్ వి సెక్యులర్ ? (మేము లౌకిక నాయకులం కామా?) అని ప్రశ్నించారు.

ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు సిక్కు భద్రతా సిబ్బందిని ఆమె వద్ద డ్యూటీలో ఉంచకూడదని నిర్ణయించారు.

అక్టోబర్ 31న సత్వంత్ సింగ్ తనకు కడుపులో నొప్పుందని చెప్పడంతో అతనిని ఆ రోజు మరుగుదొడ్డి వద్ద మొహరించారు.

ఇలా బియాంత్, సత్వంత్ ఇద్దరూ ఒకేచోట ఉండి ఆపరేషన్ బ్లూ స్టార్ కి ఇందిరా గాంధీపై ప్రతీకారం తీర్చుకున్నారు.

(నేడు ఇందిరాగాంధీ వర్ధంతి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
80 bottles of Blood was given to Indira Gandhi to save her life
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X