కాక పుట్టిస్తోన్న ఆర్కేనగర్ 'బై ఎలక్షన్': గౌతమిని బరిలో దించనున్న బీజేపీ!
తమిళనాడు లాంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను కాదని జాతీయ పార్టీ సత్తా చాటడమంటే పెను సవాల్ లాంటిదే.
చెన్నై: ఉత్తరాదిలో ఊపుమీదున్న బీజేపీ చూపు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీదకు మళ్లుతోంది. ఈ మేరకు భవిష్యత్తులో ఇక్కడ పాగా వేసేందుకు ఆ పార్టీ కసరత్తులు చేస్తోంది. ఈలోగా తమిళనాడులో ఉపఎన్నిక రావడంతో.. అక్కడ సత్తా చాటి దక్షిణాది రాష్ట్రాల్లో క్రమక్రమంగా బలపడాలని చూస్తోంది.
తమిళనాడులో దివంగత సీఎం జయలలిత మరణంతో ఆమె ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఎన్నిక జరగనుంది. దీంతో బీజేపీ ఈ స్థానంలో చక్రం తిప్పేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తమిళనాడు లాంటి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలను కాదని జాతీయ పార్టీ సత్తా చాటడమంటే పెను సవాల్ లాంటిదే.
ఈ నేపథ్యంలోనే వేగంగా పావులు కదుపుతోన్న బీజేపీ.. సినీ నటి గౌతమి పేరును తెరమీదకు తెస్తోంది. పార్టీ తరుపున ఆమెను ఆర్కేనగర్ బరిలో నిలిపేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
గౌతమినే ఎందుకు ఎంచుకున్నారు?
జయలలిత మరణానంతరం ఆమె మృతిపై అనుమానాలు లేవనెత్తుతూ బలంగా వాదించిన వ్యక్తి సినీ నటి గౌతమి. దీనిపై ఏకంగా ప్రధాని మోడీకి సైతం లేఖ రాశారు. అదే సమయంలో ప్రజల్లోను జయలలిత మృతి పట్ల అనుమానం ఉండటంతో ఆమెకు పలువురి నుంచి మద్దతు లభించింది.
ఏదేమైనా అప్పటిదాకా రాజకీయాల వాసన తెలియని గౌతమి.. జయలలిత మృతిపై స్పందించి రాజకీయాలకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నమే ఇప్పుడు ఆమెను బీజేపీకి దగ్గర చేసినట్లు తెలుస్తోంది.
జయలలిత కూడా ఒకప్పుడు సినీ నటి:
జయలలిత మృతితో ఖాళీ అయిన స్థానంలో సినీ నటిని బరిలో దించడం పార్టీకి కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. జయలలిత కూడా ఒకప్పుడు సినీ నటి కావడంతో ఆ సెంటిమెంటుతో ప్రజలను ఆకట్టుకోవచ్చనేది బీజేపీ ప్లాన్.
జయలలిత మృతిపై అనుమానాలు లేవనెత్తిన సమయంలోను నటి గౌతమికి తెర వెనుక నుంచి బీజేపీ నేతల అండదండలు లభించాయని, అందువల్లే ప్రధాని మోడీని సైతం కలవగలిగారని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో జయలలిత మృతిపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా గౌతమి ప్రధానిని కోరారు. ఏదేమైనా జయలలిత మరణం గౌతమిని బీజేపీకి దగ్గర చేసిన సూచనలు కనిపిస్తున్నాయి.
హోరాహోరీ తప్పదేమో!:
ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఈ దఫా హోరాహోరీ పోరు తప్పేలా లేదు. ఓవైపు జయలలిత మేనకోడలు దీప కొత్త పార్టీతో బరిలోకి దిగుతుంటే, అన్నాడీఎంకెపై తిరుగుబాటు చేస్తూ పన్నీర్ వర్గం నుంచి మధుసూధన్ ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయి.
ఇక అన్నాడీఎంకె నుంచి ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీవి దినకరన్ బరిలో నిలుస్తుండటం గమనార్హం. ఒకప్పుడు జయలలిత చేత పార్టీ నుంచి గెంటివేయబడ్డ వ్యక్తిని జనం ఎంతమేర ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిపక్ష డీఎంకె పార్టీ సైతం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్కేనగర్ లో ఈసారి హోరాహోరీ తప్పేలా లేదు.
చివరి నిమిషంలో పన్నీర్ అలా చేసినా!:
పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూధన్ పేరు ఖరారైనట్లు చెబుతున్నప్పటికీ.. ఆయన దీపకు మద్దతునిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అదే గనుక జరిగితే దీప మద్దతు మరింతగా పెరగడం ఖాయం.
ఇంత పోటీ నేపథ్యంలో బీజేపీ ప్రాంతీయ హవాను తట్టుకుని ఇక్కడ ఎంతవరకు నెట్టుకొస్తుంది? గౌతమిని బరిలోకి దించడం ఆ పార్టీకి ఎంతమేర మేలు చేస్తుంది అన్నది వేచి చూడాల్సిన అంశం.