జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే: లోక్సభలో పన్నీర్ వర్గం
పన్నీర్ వర్గం ఎంపీ పీఆర్ సుందరం లోక్ సభలో మరోసారి అమ్మ మృతి అంశాన్ని లేవనెత్తారు. జయలలిత మృతికి సంబంధించి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పన్నీర్ సెల్వం వర్గం నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారు. తాజాగా పన్నీర్ వర్గం ఎంపీ పీఆర్ సుందరం లోక్ సభలో మరోసారి అమ్మ మృతి అంశాన్ని లేవనెత్తారు. జయలలిత మృతికి సంబంధించి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ సీబీఐ దర్యాప్తు చేపట్టినా అది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరగకూడదని, కేంద్రం ఆదేశాలతోనే జరగాలని పీఆర్ సుందరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశాలిస్తే.. వాస్తవాలను, రహస్యాలను బయటకు పొక్కనివ్వకుండా చేసే అవకాశముందన్నారు. కాగా, జయలలిత చికిత్సకు సంబంధించి ఎయిమ్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ చాలామందిలో ఇంకా అనుమానాలు నెలకొనే ఉన్నాయి. నటి గౌతమి, పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకె బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప సహా పలువురు జయలలిత మృతిపై విచారణకు పట్టుబడుతున్నారు.
ఇదిలా ఉంటే, ఈరోజు లోక్ సభ జీర్ అవర్ లో అన్నాడీఎంకె ఎంపీలు శ్రీలంకలోని తమిళుల సమస్యల గురించి లేవనెత్తారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, తమిళులపై హింస పెరిగిపోతుందని సభలో ప్రస్తావించారు. శ్రీలంకను మిత్రదేశంగా పరిగణించరాదని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ దీనిపై సీరియస్ గా స్పందించారు. శ్రీలంకలో తమిళుల సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు.