నేడే 'రాష్ట్రపతి' ఎన్నికకు పోలింగ్: రామ్నాథ్ ఎన్నికవడం లాంఛనమే..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత స్థాయి పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక కోసం నేడు ఎన్నికలు జరగనున్నాయి. బలబలాల పరంగా ఎన్డీయే అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కే ఎక్కువ అవకాశాలు ఉండటంతో.. ఎన్నిక నామమాత్రమే అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 32 పోలింగ్ కేంద్రాలలో సోమవారం ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రపతి రేసులో ఎన్డీఏ పక్షాల తరపున రామ్నాథ్ కోవింద్, యూపీఏ పక్షాల తరపున మీరా కుమార్ పోటీ పడుతున్నారు.
నేటి ఎన్నికల ప్రక్రియలో మొత్తం 4896 మంది ప్రజాప్రతినిధులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీలంతా పార్లమెంటులో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో సరైన కారణం చూపించగలిగితే మాత్రం.. ఈసీ అనుమతితో వేరే పోలింగ్ కేంద్రాల్లోను ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ఇక ఈసారి రాష్ట్రపతి ఎన్నికకు లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండటం గమనార్హం. గత ఎన్నికల్లో ఆ బాధ్యతను రాజ్యసభ సెక్రటరీ జనరల్ నిర్వహించారు.