రేపే బీహార్లో కీలకమైన రెండోదశ పోలింగ్- బరిలో తేజస్వీ సహా 1500 మంది- 2.85 కోట్ల ఓటర్లు
బీహార్లో కీలకమైన రెండోదశ పోలింగ్కు సర్వం సిద్దమైంది. 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాల్లో ఉన్న 2.85 కోట్ల ఓటర్లు 1500 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. ఇందులో మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ సహా పలువురు కీలకమైన అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
రేపు పోలింగ్ జరిగే జిల్లాల్లో పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, షియోహర్, సీతామర్హీ, మధుబని, దర్భంగా, ముజఫర్ పూర్, గోపాల్ గంజ్, శివాన్, శరణ్, వైశాలీ, సమస్తీపూర్, బెగూసరాయ్, ఖగారియా, భాగల్పూర్, నలంద, పాట్నా ఉన్నాయి. ఇందులో వైశాలీ జిల్లాలోని రాఘవ్పూర్ నుంచి మహాకూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ రంగంలో ఉన్నారు. నితీశ్ కేబినెట్లోని పలువురు సీనియర్ మంత్రులు కూడా ఇతర నియోజకవర్గాల్లో బరిలో ఉన్నారు. గతంలో రాఘవ్పూర్లో తేజస్వి తల్లి రబ్రీదేవిని ఓడించిన సతీష్కుమార్తో ఆయన మరోసారి తలపడుతున్నారు.
బీహార్ అసెంబ్లీలోని మూడో వంతు స్ధానాల్లో రెండోదశ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీంతో కీలకమైన రెండోదశ కోసం ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి ఏడు ర్యాలీలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే నాలుగు ర్యాలీల్లో పాల్గొన్నారు. మహాకూటమి అభ్యర్ధులను ఎదుర్కనేందుకు సీఎం నితీశ్ కుమార్ చెమటోడుస్తున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను ఈసారి తేజస్వీ సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో ఎన్డీయే అభ్యర్ధులను గెలిపించుకునేందుకు మోడీ-నితీశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండోదశ పోలింగ్ తర్వాత ఫలితాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ఇరు కూటములకూ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.