కేజ్రివాల్ నా శత్రువు కాదు, మాట్లాడ్తా: హజారే
రాలేగాన్ సిద్ధి(మహారాష్ట్ర): ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ తనకు శత్రువేమి కాదని, ఆ పార్టీ నాయకత్వంతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సామాజిక కార్యకర్త అన్నా హజారే తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. తాము అరవింద్ కేజ్రివాల్కు శత్రువులం కాదని, అరవింద్ కేజ్రివాల్ తనతో మాట్లడతానని చెప్పిన విషయం తనకు తెలియదని, కేజ్రివాల్తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నాని అన్నా హజారే చెప్పారు.
ఈ విషయంపై కేజ్రివాల్కు ఓ లేఖను రాసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన సమయంలో తన పేరుతో సిమ్ కార్డులు తీసుకోవడం జరిగిందని, అయితే నిధుల సేకరణ కోసం ఉపయోగించిన విషయంతో తనకు సంబంధం లేదని హజారే అన్నారు.
తన పేరును దుర్వినియోగ పరిచినట్లు భావిస్తున్నానని, అందుకే ఈ విషయంలో పూర్తి వివరాలను తెలుసుకునేందుకు కేజ్రివాల్కు లేఖను రాసినట్లు తెలిపారు. డబ్బు విషయంలో తనకేలాంటి ఆసక్తి లేదని, కానీ తన పేరు దుర్వినియోగం జరుగుతోందన్న విషయాన్ని సహించలేకపోతున్నానని తెలిపారు. కాగా సోమవారం మీడియా సమావేశం నిర్వహిస్తున్న కేజ్రివాల్పై కొందరు అన్నా హజారే, బిజెపి మద్దతుదారులు ఇంకు చల్లిన విషయం తెలిసిందె.
తను ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని, ప్రచారం కూడా నిర్వహించనని అన్నా హజారే స్పష్టం చేశారు.డిసెంబర్ 29న రాంలీలా మైదానంలో కేజ్రీవాల్ తాను జన్ లోక్పాల్ బిల్లును పాస్ చేయిస్తానంటూ వ్యాఖ్యానించారని, అయితే అది పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుందని ఆయన అన్నారు. తనకు కేజ్రీవాల్ నుంచి ఓ లేఖ వచ్చిందని, ఇంకా దాన్ని చదవలేదని హజారే చెప్పారు.