ఆ డబ్బుపై ఆధారాలు: మన్మోహన్కు జైట్లీ దిమ్మతిరిగే కౌంటర్, నోట్ల రద్దు వల్ల ఇవి ఆగిపోయాయి
గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ఆర్థికరంగ చరిత్రలో కీలక మలుపుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు.
న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దేశ ఆర్థికరంగ చరిత్రలో కీలక మలుపుగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించారు. భవిష్యత్తుతరాలు నిజాయతీతో కూడిన వ్యవస్థలో జీవించేందుకు ఈ చర్య దోహదపడుతుందన్నారు.
Recommended Video
నోట్లరద్దుతో తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నామన్నారు. ప్రస్తుతం మనదేశ ఆర్థిక వ్యవస్థలో నగదు తగ్గిందని, పన్ను చెల్లింపుదారులు పెరిగారన్నారు. నోట్ల రద్దుతో నల్ల కుబేరులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు జైట్లీ కౌంటర్
నోట్ల రద్దు వల్ల తొలి వార్షికోత్సవ నేపథ్యంలో 'నోట్లరద్దు తర్వాత ఓ సంవత్సరం' పేరుతో తన బ్లాగులో పలు అంశాలు వెల్లడించారు జైట్లీ. భారత ఆర్థికరంగ చరిత్రలో కీలకమలుపుగా 2016 నవంబరు 8 గుర్తుండిపోతుందని, మొత్తంగా విశ్లేషిస్తే నోట్లరద్దు అనంతరం దేశం చాలా మెరుగైన, పారదర్శక, నిజాయతీతో కూడిన వ్యవస్థలోకి ప్రవేశించిందని, దాని ప్రయోజనాలు కొందరి కళ్లకు కనపడకపోవచ్చు కానీ, నోట్లరద్దు తర్వాత చోటుచేసుకున్న ఆర్థికాభివృద్ధిపట్ల భవిష్యత్తుతరాలు గర్వపడుతాయని, ఎందుకంటే వారికి నిజాయతీతో కూడిన, పారదర్శక వ్యవస్థ అందుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, విపక్షాల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఆ డబ్బు ఎవరిదో ఆధారాలు ఉన్నాయి
నోట్ల రద్దుతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని, రద్దైన నోట్లలో చాలామొత్తం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరాయని, ఆ డబ్బెవరిదనే విషయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని జైట్లీ అన్నారు. ఆగస్టు 2017 వరకు కొత్తగా 56 లక్షల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారని, కార్పొరేటేతర సంస్థలు చెల్లించే స్వీయ మదింపు పన్ను 34.25 శాతం పెరిగిందని, డిజిటల్ చెల్లింపులు పెరిగి, నగదు చెలామణి తగ్గిందని జైట్లీ తెలిపారు.
మన్మోహన్ సింగ్ హయాంలో ఇలా
నోట్ల రద్దును వ్యవస్థీకృత దోపిడీగా మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు దీనిపై జైట్లీ మండిపడ్డారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో 2జీ స్కాం, కామన్వెల్త్ క్రీడలు, కోల్ స్కాం వంటి వ్యవహారాల్లో దోపిడీ చోటు చేసుకుందని విమర్శించారు.
ఏడాది అయినా
కాగా, పెద్ద నోట్ల రద్దు ఏడాది అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నల్లధన వ్యతిరేక దినంగా పాటిస్తుంటే, విపక్షాలు బ్లాక్ డేగా పాటిస్తున్నాయి. నోట్ల రద్దు గురించి ఇంకా చర్చ సాగుతోంది. కీలకమైన ఈ అడుగు తర్వాత దేశవ్యాప్తంగా కనిపించిన ప్రభావంపై అధికార, విపక్షాల్లో భిన్నరకాల వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి.
గణాంకాలు విడుదల చేసిన పీఎంవో
పెద్ద నోట్ల చలామణీ తగ్గడంతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని పీఎంవో తెలిపింది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకొని ఉండకపోతే వ్యవస్థలో పెద్దనోట్లు ఎంతగా పెరిగిపోయి ఉండేవో వివరించింది. దీనికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.
నోట్ల రద్దు వల్ల ఇలాంటి తీవ్ర ఘటనలు ఆగిపోయాయి
ఉగ్రవాదులకు, మావోయిస్టులకు నిధుల ప్రవాహం నిలిచిపోయేందుకు, కాశ్మీర్లో సైనికులపై రాళ్లదాడి ఆగిపోవడానికి నోట్ల రద్దు నిర్ణయం దోహదపడిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మరోవైపు, నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని సక్రమ నగదుగా మార్చుకునేందుకు ఉద్దేశించిన పెద్ద కుంభకోణంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.