సూరత్లో అణుబాంబు పేల్చాలనుకున్న యాసిన్భత్కల్
న్యూఢిల్లీ: ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులు అణుబాంబును ఉపయోగించాలని ప్రణాళిక వేసుకున్నారు. అణుబాంబుతో గుజరాత్లతోని సూరత్లో దాడి చేయడానికి స్కెచ్ గీశారు. ఈ విషయాన్ని ఐఎం ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడించాడు.
వరుస పేలుళ్లతో ఇప్పటికే మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులు అణు పేలుళ్లతో నగరాలకు నగరాలనే శ్మశాన దిబ్బలుగా మార్చేందుకు వ్యూహ రచన చేశారు. ఈ ఏడాది ఆగస్టు 27న భత్కల్ను భారత్ - నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
విచారణ సందర్భంగా భత్కల్ అత్యంత కీలక విషయాలు బయటపెట్టినట్లు తెలిసింది. తనకో చిన్న అణుబాంబును పంపించగలవా అని పాకిస్థాన్లోని తమ బాస్ రియాజ్ భత్కల్ను ఫోన్లో అడిగానని, పాకిస్థాన్లో దేనినైనా సమకూర్చవచ్చు అని రియాజ్ జవాబిచ్చాడని, సూరత్లో దాడికి తనకొక అణుబాంబును పంపించాలని కోరానని, అణుబాంబు పేలుళ్లతో ముస్లిములు కూడా చచ్చిపోతారు కదా అని రియాజ్ ఆందోళన వ్యక్తం చేశాడని యాసిన్ చెప్పాడు.
ప్రతి ముస్లిం కుటుంబం కూడా చడీ చప్పుడు చేయకుండా, ఎవరికీ ఏమీ చెప్పకుండా నగరం విడిచి వెళ్లిపోండని మనం మసీదులన్నిటిలోనూ పోస్టర్లు అంటిద్దామని తాను జవాబిచ్చానని యాసిన్ భత్కల్ చెప్పినట్లు దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.