బీహార్ టాపర్స్ స్కాంలో వింత: 23 ఏళ్లకే పీహెచ్డీ
పాట్నా: బీహార్ టాపర్స్ స్కాంలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. బీహార్ స్కూల్ ఎగ్జాజిమినేషన్ బోర్డు మాజీ ఛైర్మన్ లోకేశ్వర్ ప్రసాద్ సింగ్ భార్య హిల్సా జేడీయు మాజీ మహిళా ఎమ్మెల్యే ఉషా సిన్హా విద్యార్హత పత్రాలు నకిలీవని తేలింది.
2010 ఎన్నికల్లో ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ద్వారా మరో కొత్త విషయం వెలుగు చూసింది. ఈ అఫడవిట్ ప్రకారం ఆమె 8 ఏళ్లకే పదో తరగతి పూర్తి చేయడం విశేషం. ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించే నాటికి ఆమె వయసు 49 సంవత్సరాలుగా పేర్కొంది.
దీంతో పాటు బీహార్లోని అవధ్ యూనివర్సిటీ నుంచి 1975-76 విద్యాసంవత్సరంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు ఆమె సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే యూనివర్సిటీని 1976లో ప్రారంభిస్తే, రెండేళ్ల పాటు ఉండే మాస్టర్స్ డిగ్రీని ఆమె ఒకే ఏడాదిలో ఎలా పూర్తి చేశారనే విషయం అంతుచిక్కడం లేదు.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఉషా సిన్హా తన పీహెచ్డీని మగధ్ యూనివర్సిటీలో 23 ఏటా పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొనడం. ప్రస్తుతం ఆమె పాట్నాలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లో హిందీ విభాగంలో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేసిన టాపర్స్ స్కాంలో ఉషా సిన్హా పేరు కూడా వినిపిస్తోంది.