రసవత్తరం: నితీష్కు ఎదురు తిరిగిన మాంఝీకి షాక్, ఆఖర్లో బీజేపీ ట్విస్ట్
పాట్నా: బీహార్ రాజకీయం నిమిషనిమిషానికి రసవత్తరంగా మారుతోంది. రేపు (ఈ నెల 20వ తేదీ, శుక్రవారం) ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ బలపరీక్షను ఎదుర్కోనున్నారు. శాసన సభలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో జేడీయూలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వర్గం, సీఎం మాంఝీ వర్గం, భారతీయ జనతా పార్టీ వర్గాల తీరు ఉత్కంఠను రేపుతున్నాయి.
మాంఝీని బహిష్కరించిన జేడీయు నాయకత్వం తమను బీహార్ శాసన సభలో ప్రతిపక్షంగా గుర్తించాలని స్పీకర్ను కోరారు. దీనిని బీజేపీ వ్యతిరేకించింది. ఒకే పార్టీకి చెందిన మాంఝీ(జేడీయు ఈయనను బహిష్కరించింది), నితీష్ కుమార్ వర్గం అధికార, ప్రతిపక్షాలుగా ఎలా కూర్చుంటాయని ప్రశ్నించింది.
అయితే, స్పీకర్ గురువారం నాడు జేడీయును ప్రతిపక్షంగా గుర్తించారు. స్పీకర్ ఆ విధంగా ప్రకటన కూడా చేశారు. ప్రతిపక్ష నేతగా విజయ్ చౌదరి నియమితులయ్యారు. దీనిపై బీజేపీ గుర్రుమంటోంది. తాము ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నామని, ఒకే పార్టీకి చెందిన వారు అధికార, ప్రతిపక్షాలుగా ఉండటం విడ్డూరమని మండిపడుతోంది. తమకు ప్రతిపక్ష హోదా తప్పించడాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ ప్లకార్డులతో నిరసన తెలిపాయి.
శుక్రవారం జరగనున్న విశ్వాస పరీక్షలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందనేది ఉత్కంఠగా కనిపించింది. అయితే, మాంఝీకి ఓటేయాలని బీజేపీ విప్ జారీ చేసి ఉత్కంఠకు తెరదించింది. ఊహించిందే అయిన ఇది మరో మలుపు. జేడీయు చీలికకు బీజేపీయే కారణమని నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. నితీష్కు జేడీయు, లాలూ నేతృత్వంలోని ఆర్డేజీ తదితరులు మద్దతు పలుకుతున్నారు.
మాంఝీకి జేడీయులోని ఓ వర్గం మద్దతుగా ఉంది. అయితే, బీజేపీ మద్దతిస్తేనే ఆయన గట్టెక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. అందులోని జేడీయులో.. చివరి నిమిషంలో ఎవరు ఎవరికి మద్దతిస్తారనే అంశం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మాంఝీకి మద్దతిస్తున్న పలువురు ఎమ్మెల్యేల పైన జేడీయు వేటు వేసింది.
మాంఝీకి హైకోర్టు షాక్
మాంఝీకి గురువారం హైకోర్టులోను షాక్ తగిలింది. జేడీయుకు చెందిన ఎనిమిది మంది రెబల్ అభ్యర్థులు ఓటు వేసే అవకాశాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మాంఝీ మరింత ఇరకాటంలో పడ్డారు.
ఎమ్మెల్యేలను కొనేయత్నం
బలనిరూపణకు ఒకేరోజు మిగిలి ఉండటంతో జేడీయు మాంఝీ నేతృత్వంలోని ప్రభుత్వం పైన ఆరోపణలు ముమ్మరం చేస్తోంది. మైనార్టీలో పడ్డ ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది. జేడీయు, మాంఝీ... ఇరువర్గాలు కూడా ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి.
విశ్వాస పరీక్షలో ఓడితే పేదలకు నష్టం
తాను విశ్వాస పరీక్షలో నెగ్గితే ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేస్తానని మాంఝీ అన్నారు. లేకుంటే పేదలు అన్యాయమవుతారని చెప్పారు. అదే సమయంలో మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. మంత్రి పదవులు కావాలని ఆశించేవాళ్లు తన వైపు రావాలన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో ఘోర పరాజయం నేపథ్యంలో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో మాంఝీని కూర్చోబెట్టారు. ఇప్పుడు నితీష్ ఆ పదవిలో కూర్చునేందుకు పావులు కదుపుతున్నారు. ఆయనకు ఆర్జేడీ మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో నితీష్కు మాంఝీ ఎదురు తిరిగారు. తాను సీఎం పీఠం పై నుండి వైదొలగేది లేదని విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.