నితీష్ కుమార్ దూరమవుతున్నారని బీజేపీకి ముందే తెలుసా? అయినా ఆపలేదా?
పాట్నా: బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్డీఏ కూటమి, బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్.. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, నితీష్ కుమార్.. బీజేపీ, ఎన్డీఏకు దూరమవుతున్నారని ఆ పార్టీకి ముందే తెలుసా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది.
నితీష్ వెళుతున్నారని తెలిసినా బీజేపీ అధిష్టానం పట్టించుకోలేదా?
నితీష్ కుమార్.. బీజేపీ కూటమిని వీడటం ద్రోహమని, ఆయన తరచూ పార్టీలు మారడం ద్వారా విశ్వసనీయత కోల్పోయారని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. అయితే, నితీష్ కుమార్ ను ఆపేందుకు బీజేపీ అగ్రనేతలు కూడా ప్రయత్నించలేదని ఆ వర్గాలు పేర్కొన్నట్లు ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది. ఎన్డీఏను వీడతారని తెలిసినప్పటికీ.. నితీష్ ను తమతో కొనసాగించాలనే ప్రయత్నం బీజేపీ అధిష్టానంలోని పెద్దలు చేయలేదని సమాచారం.
మిత్రధర్మం పాటించామన్న బీజేపీ.. అమిత్ షా ఫోన్ చేశారు కానీ..
జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకే నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నారరని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆయనే ఒక మంచి అవకాశంగా మారాలని చూస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, అమిత్ షా.. సోమవారం నితీష్ కుమార్ కు ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. కొందరు నాయకులు కూడా నితీష్ ను సంప్రదించారు కానీ, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
కాగా, బీజేపీకి వచ్చిన(70కిపైగా) స్థానాలతో పోలిస్తే.. సగమే జేడీయూకు వచ్చినప్పటికీ.. మిత్ర ధర్మంలో భాగంగా నితీష్ కుమార్ ను తాము ముఖ్యమంత్రిగా కొనసాగించామని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతకుముందు వెల్లడించారు. అయినప్పటికీ.. ఆయన కొనసాగకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీహార్ రాష్ట్రంలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది.
‘మహారాష్ట్ర' రిపీట్ అవుతుందనుకున్న నితీష్ కుమార్
అయితే, నితీష్ మాత్రం మహారాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో.. బీహార్ రాష్ట్రంలో కూడా చేస్తుందని భయపడినట్లున్నారు. జేడీయూలో చీలికతెచ్చి సీఎం పదవిని తనకు దూరం చేస్తారని అనుమానించారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీకి దూరం జరిగినట్లు తెలుస్తోంది. జేడీయూ మాజీ నేత ఆర్సీపీ సింగ్ను బీజేపీ ఎంచుకుందని అనుమానించారు. అతని ద్వారా జేడీయూలో చీలిక తెచ్చి.. పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని చూస్తోందని నితీష్ సందేహించారు. అనేక రకాల ఆలోచనల తర్వాత ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
రేపే ముహూర్తం: సీఎంగా నితీష్ కుమార్, డిప్యూటీగా తేజస్వి?
బీహార్ రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్.. మరోసారి ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ సారథ్యంలోని మహాఘటబంధన్తో చేతులు కలిపారు. దీంతో బీహార్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఆర్జేడీ సారథ్యంలోని ఏడు పార్టీలతో కూడిన మహాఘటబంధన్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నితీష్.. బీహార్ గవర్నర్ను కూడా కలిశారు. ఈ ఒక్కరోజే నితీష్.. గవర్నర్ ఫాగు చౌహాన్ను రెండుసార్లు కలుసుకున్నారు.
మొదటి భేటీలో తన రాజీనామాను అందజేసిన నితీష్.. రెండోసారి కలిసినప్పుడు మహాఘటబంధన్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా, తమకు ఏడు పార్టీల మద్దతు ఉందని, 164 మంది ఎమ్మెల్యేల బలం ఉందని నితీష్ కుమార్ అంతకుముందు వెల్లడించారు.
జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తాము బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని నితీష్ స్పష్టం చేశారు. ఎన్డీఏ నుంచి బయటికి రావాలని నేతలంతా కోరడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.