ఢిల్లీ అసెంబ్లీలో డ్రామా: బీజేపీ ఎమ్మెల్యే గెంటివేత..! (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఢిల్లీ విధాన సభలో మంగళవారం డ్రామా వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మను మార్షల్స్ సాయంతో బయటికి గెంటివేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్కు విశేష అధికారులను కేంద్రం ప్రకటించడంపై మంగళవారం చర్చ చేపట్టారు.
ఈ చర్చలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ శర్మ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో స్పీకర్, శర్మను సభ నుంచి బయటికి తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన మార్షల్స్ శర్మను బయటికి గెంటివేశారు.
అంతక ముందు శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అల్కా లాంబాపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను లాగేసుకుంటున్నారని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై శర్మ తప్పుబట్టారు.
అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన తర్వాత శర్మ మీడియాతో మాట్లాడుతూ ఆప్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై తాను మాట్లాడుతుంటే, స్పీకర్ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నానని బయటికి పంపివేశారని తెలిపారు.
స్పీకర్ పార్టీ మెంబర్ లాగా మాట్లాడుతున్నారని, స్పీకర్ పదవికే అతను అనర్హుడని, అతనిపై చాలా క్రిమినల్ కేసులున్నాయని ఆరోపించారు. అతను నన్ను ఎక్కువ సమయం బయటికి పంపించలేడని, ఎందుకంటే నేను ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని అని అన్నారు.
మొత్తం 70 స్ధానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్ధానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ కేవలం మూడు స్ధానాలను మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే.