అన్నాడిఎంకె సంక్షోభం: బిజెపితో టచ్ లోకి, పట్టుకోల్పోయిన చిన్నమ్మ
అన్నాడిఎంకెలో తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానిదే పై చేయిగా కన్పిస్తోంది.శశికళ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన పన్నీర్ సెల్వం పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని బయటకు పంపేలా
చెన్నై:అన్నాడిఎంకెలో తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానిదే పై చేయిగా కన్పిస్తోంది.శశికళ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన పన్నీర్ సెల్వం పార్టీ నుండి శశికళ కుటుంబాన్ని బయటకు పంపేలా చేశారు. అయితే పన్నీర్ కు కేంద్రంలోని బిజెపి సహకారం లభిస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు.అన్నాఢీఎంకె సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది.
అన్నాడీఎంకెలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం గ్రూపులు విలీనం దిశగా చర్చలు సాగుతున్నాయి.అయితే ఈ పరిణామాల్లో శశికళ కుటుంబాన్ని పార్టీ నుండి దూరం పెట్టగలిగారు పన్నీర్ సెల్వం.
అయితే పార్టీ పై ఎంత త్వరగా పట్టును సాధించిందో శశికళ, అంతే త్వరగా శశికళ కుటుంబానికి పార్టీ నుండి పట్టుకోల్పోవాల్సి వచ్చింది.అయితే రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అన్నాడిఎంకె లో శశికళ కుటుంబాన్ని పక్కకు తప్పించేలా చేయడంలో పన్నీర్ సెల్వం గ్రూప్ సక్సెస్ అయింది.
అయితే దినకరన్ పై ఢిల్లీలో కేసు నమోదు కావడంతో అన్నాఢీఎంకెలోని రెండు గ్రూపులు విలీనమయ్యేందుకు సిద్దమయ్యారు.
శశికళ పట్టు సడలినట్టే
అక్రమాస్తుల కేసులో పరప్పర ఆగ్రహార జైలులో ఉన్న శశికళకు పార్టీపై పట్టు తప్పినట్టే కన్పిస్తోంది.శశికళ ఏరికోరి ముఖ్యమంత్రిని చేసిన పళనిస్వామి నేతృత్వంలోనే ఆమె కుటుంబాన్ని పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.
జయలలిత మరణం తర్వాత పార్టీని ఆమె తన చేతుల్లోకి తీసుకొన్నారు.ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కువ భాగం శశికళ ద్వారానే టిక్కెట్లు పొందారు. ఈ కారణంగా ఆమెకు పార్టీపై సులభంగానే పట్టు సాధించారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే కేసు ఆమెకు ఇబ్బందిగా మారింది. తాజాగా పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలతో ఆమెకు పార్టీపై పట్టు తప్పినట్టేనని అనిపిస్తోంది.
తమిళనాడులో విస్తరణకు బిజెపి వ్యూహం
అన్నాడీఎంకె సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకొనేందుకుగాను బిజెపి పావులు కదుపుతోంది. అన్నాఢీఎంకెలో అంతర్గత సంక్షోభం కారణంగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు , పార్టీ నాయకులు తమ పార్టీ వైపు చూస్తున్నారని బిజెపి నాయకులు చెబుతున్నారు.వారంతా తమ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని ఆ పార్టీ తమిళనాడు ఇంచార్జ్ మురళీధర్ రావు చెప్పారు.అన్నాఢీఎంకె ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు తాము ప్రయత్నిచడం లేదన్నారు.అయితే రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలు తమ పార్టీ విస్తరణకు అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్రం పరోక్ష హెచ్చరికలు
ఆర్ కె నగర్ ఉప ఎన్నిక రద్దుతో పాటు, ఎన్నికల కమిషన్ కు లంచం ఇచ్చేందుకు దినకరన్ ప్రయత్నించారనే కేసులు పరోక్షంగా కేంద్రం నుండి శశికళ వర్గానికి వచ్చిన హెచ్చరికలుగా పళని గ్రూప్ భావిస్తోంది.శశికళ కుటుంబాన్ని పక్కకు పెట్టి, పన్నీర్ తో రాజీ చేసుకోకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావించి ఈ మేరకు పన్నీర్ తో రాజీఫార్మూాలను పళని గ్రూప్ ఎంచుకొంది.
అధికార పంపిణీలో కులాలదే కీలక పాత్ర
అన్నాడీఎంకెలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి, తంబిదురైలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.అయితే తంబిదురై ఢిల్లీలో కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి.పళనిస్వామి సిఎంగా కొనసాగే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.అయితే డిప్యూటీ సిఎంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడ పన్నీర్ సెల్వానికి కట్టబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.
దేవర్ వర్గానికి చెందిన పన్నీర్ కు డిప్యూటీ సిఎం పదవిని ఇస్తే ఆయన స్థాయిని తగ్గించడమేనే ప్రచారం ఉంది. మరో వైపుగౌండర్ల వర్గానికి చెందిన పళనిస్వామిని డిప్యూటీ సిఎం పదవిలో కూర్చోబెడితే బిసిల ఆగ్రహం ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.