పోలింగ్ కేంద్రంలో పాము కలకలం: ఓటర్లు, సిబ్బంది పరుగో పరుగు, సీఎం సెంటిమెంట్!
బెంగళూరు: కర్ణాటకలో మూడు లోక్ సభ నియోజక వర్గాలు, రెండు శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభం అయ్యింది. ఉప ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి స్థానిక ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సందర్బంలో పోలింగ్ కేంద్రంలోకి ఓ పాము ప్రవేశించి హల్ చల్ చెయ్యడంతో ఓటర్లు, సిబ్బంది భయంతో పరుగు తీశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి రామనగర, చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గాల్లో పోటీ చేసి విజయం సాధించారు. రెండు నియోజక వర్గాల్లో విజయం సాధించిన కుమారస్వామి తరువాత రామనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి జేడీఎస్ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శనివారం ఉదయం రామనగర శాసన సభ నియోజక వర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో స్థానికులు ఓటు వెయ్యడానికి క్యూకట్టారు.
రామనగరలోని మోట్టేదోడ్డిలోని పోలింగ్ కేంద్రం 179లోకి ఆనూహ్యంగా ఓ పాము ప్రవేశించడంతో ఓటర్లు హడలిపోయారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ఓటర్లు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగు తీశారు. పాము పోలింగ్ కేంద్రంలో చాలసేపు అటూఇటూ సంచరించింది.
#WATCH: A snake being removed from polling booth 179 in Mottedoddi of Ramanagaram. The voting was delayed after it was spotted and resumed soon after it was removed. #KarnatakaByElection2018 pic.twitter.com/W1XrDeIP3z
— ANI (@ANI) November 3, 2018
పోలింగ్ కేంద్రంలో పాము సంచరించడంతో చాలసేపు ఓటింగ్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు పాములు పట్టే వ్యక్తులను పిలిపించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న పామును అక్కడి నుంచి బయటకు పంపించడంతో ఓటర్లు, పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పోలింగ్ కేంద్రంలో పాము సంచరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పోలింగ్ కేంద్రంలోకి పాము రావడం సీఎం కూమరస్వామి కలిసి వచ్చిందని, ఆయనకు అంతా శుభం జరుగుతోందని జేడీఎస్ నాయకులు అంటున్నారు. పోలింగ్ కేంద్రంలోకి పాము రావడంతో ఎవరికీ ఎలాంటి హానిజరగలేదని అధికారులు తెలిపారు.