వ్యాక్సినేషన్పై కేంద్రం ఎదురుదాడి- రాష్ట్రాలదే పాపం- జాబితాలో ఏపీ, తెలంగాణ
దేశవ్యాప్తంగా కరోనా ఫస్ట్వేవ్ ముగిసిన తర్వాత సెకండ్ వేవ్ మొదలయ్యే సమయానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి సెకండ్ వేవ్కు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రం వ్యాక్సినేషన్ విషయంలో విఫలం కావడమేనని రాష్ట్రాలు ఆరోపిస్తుండగా... కేంద్రం తాజాగా ఈ విమర్శలపై ఎదురుదాడి మొదలుపెట్టింది. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడానికి ఆ తొమ్మిది రాష్ట్ర్రాలే కారణమని కేంద్ర ఆర్ధికశాఖ ఓ నోట్ విడుదల చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉండటం విశేషం.
Recommended Video
వ్యాక్సినేషన్ డ్రైవ్పై విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ తొలి దశను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫ్రంట్లైన్ కరోనా వారియర్లుగా ఉన్న వైద్య సిబ్బంది, డాక్టర్లు, పోలీసులకు వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రెండో దశలో 60 ఏళ్లు దాటిన వృద్ధులకు, 45 ఏళ్లు దాటి తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారికి ఇచ్చారు. మూడో దశలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించారు. కానీ రెండో దశ నుంచే వ్యాక్సిన్ల కొరతపై విమర్శలు మొదలయ్యాయి. చాలా రాష్టాల్లో మూడో దశ మొదలు కాకపోవడమో లేక మొదలై ఆగిపోవడమో జరిగిపోయింది. దీంతో కేంద్రం తీరుపై పలు రాష్టాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
వ్యాక్సినేషన్పై కేంద్రం ఎదురుదాడి
వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్రం కౌంటర్ ఇచ్చింది. ఇందులో తొలి దశ వ్యాక్సినేషన్ సందర్భంగా దేశంలో 9 రాష్ట్రాలు వ్యవహరించిన తీరుతో ఈ కార్యక్రమం నత్తడకన సాగిందని పేర్కొంది. కేంద్రం ఇచ్చిన టీకాల్ని వృధా చేయడం, టీకాలపై విమర్శలు చేయడం, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం వంటి చర్యలతో వ్యాక్సినేషన్ నెమ్మదించడానికి ఆయా రాష్టాలు కారణమయ్యాయంటూ కేంద్ర ఆర్ధికశాఖ ఓ నోట్ విడుదల చేసింది. దీంతో టీకా కార్యక్రమంపై వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి బయటపడేందుకే ఆర్ధికశాఖ ఈ నోట్ విడుదల చేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్టాలకూ కేంద్రం కౌంటర్
వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగడానికి కారణమయ్యాయంటూ 9 రాష్ట్రాల పేర్లను కేంద్ర ఆర్ధికశాఖ తన నోట్లో ప్రస్తావించింది. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణతో పాటు రాజస్ధాన్, పంజాబ్, ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ఉన్నాయి. విచిత్రంగా ఇవన్నీ బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలే. ప్రస్తుతం వ్యాక్సిన్ల విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న రాష్ట్రాలే. ఇందులో ఏపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు కూడా రోజూ వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ఏపీ సీఎం జగన్ వ్యాక్సిన్లపై తోటి ముఖ్యమంత్రులకు లేఖలు రాయగా.. టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ నిత్యం కేంద్రాన్ని నిలదీస్తున్నారు.
గణాంకాలతో కేంద్రం ఎదురుదాడి
కేంద్ర ఆర్ధికశాఖ విడుదల చేసిన నోట్లో దేశంలో 9 రాష్ట్రాలు వ్యాక్సినేషన్ నత్తనడక సాగడానికి కారణమయ్యాయని పేర్కొనగా.. ఆయా రాష్ట్రాలకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 5.65 కోట్ల డోసులు ఇవ్వగా.. వాటిలో 2.6 కోట్ల డోసులు మాత్రమే వాడారని, మిగిలినవి వృధా అయ్యాయని వెల్లడించింది. జూన్ 4 నాటికి జాతీయ సగటు ప్రకారం 81 శాతం మంది వైద్య సిబ్బంది టీకా అందుకోగా.. మహారాష్ట్ర (77), పంజాబ్ (65), తెలంగాణ (64) మాత్రం అంతకంటే తక్కువగా టీకా ఇచ్చాయని గుర్తుచేసింది. ఈ రాష్టాల్లో వ్యాక్సిన్ల వృథా కూడా ఎక్కువగానే ఉంది. పంజాబ్లో 1.43 లక్షలు, ఛత్తీస్ఘడ్లో 1.55 లక్షలు, తెలంగాణలో 2.25 లక్షలు, రాజస్దాన్లో 4.76 లక్షలు, కేరళలో 6.33 లక్షల డోసుల వ్యాక్సిన్ వృధా అయినట్లు కేంద్రం తెలిపింది. అంతే కాదు విపక్షాలు టీకాపై జనాల్లో అనుమానాలు రేకెత్తించాయని, వ్యాక్సిన్లకు అనుమతివ్వడాన్ని తప్పుబట్టాయని కూడా ఆర్ధిక శాఖ నోట్ ఆరోపించింది.