సిఎం హంగామా, అడ్డుకున్న సుధారాణి: అలాగే కెవిపి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)ను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ బుధవారం రాజ్యసభలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ వద్ద ఉన్న పత్రాలను లాక్కునే ప్రయత్నం చేశారు. దానిని తెలంగాణ టిడిపి ఎంపి గుండు సుధారాణి అడ్డుకనే ప్రయత్నాలు చేశారు.
మంగళవారం లోకసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ కార్యక్రమాలను సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యాన్నికాపాడాలంటూ సుజనా చౌదరి, ఇతర సీమాంధ్ర ఎంపీలు నినాదాలు చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, వి వాంట్ సమైక్యాంధ్ర అనే ప్లకార్డులు ప్రదర్శించారు.

సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. సభలో సిఎం రమేష్ సెక్రజరీ జనరల్ వద్దకు దూసుకెళ్లి పత్రాలు లాక్కునే ప్రయత్నాలు చేశారు. చైర్మన్ మైకును లాగేందుకు చూశారు. ఈ సమయంలో గుండు సూధారాణి ఆయనను అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది.
కెవిపి రామచంద్ర రావు చైర్మన్కు ముందు వి వాంట్ సమైక్యాంధ్ర ప్లకార్డును పట్టుకొని నిలబడ్డారు. ఆయన మొదటి నుండి అదే పద్ధతిలో నిరసన తెలుపుతున్నారు. సభలో గందరగోళం ఏర్పడటంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ వాయిదా వేశారు. టిడిపి ఎంపీలు కురియన్తో వాగ్వాదానికి దిగారు. కాగా, రాజ్యసభలో సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ బిల్లు ప్రవేశ పెడతామని రాజీవ్ శుక్లా చెప్పారు.












Click it and Unblock the Notifications