ఓటమి భయం, రెండు చోట్ల సీఎం సిద్దూ పోటీ, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫైర్, ప్రతిపక్షాలకు అస్త్రం!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రతిపక్షాల చేతికి మంచి అస్త్రం ఇచ్చారు. ఒకే నియోజక వర్గంలో పోటీ చేస్తానని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చిన సీఎం సిద్దరామయ్య ఇప్పుడు రూటు మార్చారు. పోటీ చేస్తున్న చాముండేశ్వరీ నియోజక వర్గంలో ఓడిపోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు సిద్దరామయ్య రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చెయ్యాలని నిర్ణయించారు. ఓటమి భయంతోనే సీఎం రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నారని బీజేపీ, జేడీఎస్ నాయకులు విమర్శలు మొదలు పెట్టారు.
కొడుకు కోసం త్యాగం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 2013 ఎన్నికల్లో మైసూరు జిల్లాలోని వరుణ శాసన సభ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడు వరుణ నియోజక వర్గం నుంచి సిద్దరామయ్య కుమారుడు డాక్టర్ యతీంద్ర పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
జేడీఎస్ భయం
సీఎం సిద్దరామయ్య మైసూరు జిల్లా చాముండేశ్వరీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. చాముండేశ్వరీ నియోజక వర్గంలో ప్రస్తుతం జేడీఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సిద్దరామయ్య అక్కడ ఓడిపోయే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు నివేదిక ఇచ్చాయని వెలుగు చూసింది.
బీజేపీ, జేడీఎస్ మాస్టర్ ప్లాన్
చాముండేశ్వరీ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యను ఓడించడానికి జేడీఎస్, బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా ఒప్పందం చేసుకున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి సీఎం సిద్దరామయ్య సిద్దం అయ్యారు.
డేట్ ఫిక్స్ చేసిన సీఎం
ఏప్రిల్ 24వ తేదీన బాగల్ కోటే జిల్లాలోని బాదామి నియోజక వర్గంలో నామినేషన్ వెయ్యాలని సీఎం సిద్దరామయ్య నిర్ణయించారని తెలిసింది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య సన్నిహితుడు, మంత్రి హెచ్ ఎం. రేవణ్ణ బాదామిలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.
సీఎంపై ఎమ్మెల్యే ఫైర్
సిద్దరామయ్య బాదామి నుంచి పోటీ చెయ్యాలని సిద్దం కావడంతో స్థానిక కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిమ్మనకట్టి అసహనం వ్యక్తం చేశారు. అయితే సీఎం సిద్దరామయ్య ఎమ్మెల్యే చిమ్మనకట్టి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను గురువారం బెంగళూరు పిలిపించి నచ్చ చెప్పి నామినేటెడ్ పదవులు ఇస్తామని బుజ్జగించారు.