మైక్రో ఏటీఎంలు: పెద్ద నోట్లు రద్దుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయాలను ప్రకటించింది. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ పరిమితి లేదని, అంతేగాక, బ్యాంకుల్లో రోజుకు ఎన్నిసార్లైనా జమ చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ వెల్లడించారు. త్వరలోనే మైక్రో ఏటీఎంలను కూడా తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించిన అనంతరం సోమవారం ఉదయం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో వస్తోన్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు.
ప్రజలకు అందుబాటులోకి రూ.500 నోట్లను తీసుకొచ్చినట్లు శక్తికాంతదాస్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మొత్తం 2.5 లక్షల పోస్టాఫీసుల్లో నగదు అందుబాటులో ఉందని చెప్పారు.
అన్ని ఏటీఎంలలో డబ్బు రేపు లేదా ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పాత నోట్ల మార్పిడిని ప్రారంభించినట్లు చెప్పారు.
నగదు నిల్వలు, మార్పిడిపై తాము ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటీఎంల వద్ద మరింత భద్రత పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే 50లక్షల రూ. 500 నోట్లు మార్కెట్లోకి వచ్చాయని తెలిపారు. నేడు లేదా రేపటి నుంచి ఏటీఎంలలో రూ. 500 కోట్ల నోట్లు అందుబాటులోకి వస్తాయని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఇందుకు ముందున్న పరిమితి రోజు రూ. 10వేలు, వారానికి రూ. 20వేలను వారానికి రూ. 24వేలకు పెంచినట్లు తెలిపారు. అంతేగాక, రూ. 2000 నుంచి రూ. 2500, రూ. 4000 నుంచి రూ. 4500లకు డ్రా మొత్తం పెంచినట్లు తెలిపారు.
సరైన ఆధారాలు చూపిస్తూ రూ.50వేలు డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఏటీఎంల భద్రత, పని తీరు మెరుగుపర్చేందుకు టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు శక్తికాంత్ దాస్ చెప్పారు. బ్యాంకుల వద్ద ప్రజలు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు అంశంపై ఇప్పటికే రాష్ట్రాల కార్యదర్శులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సూచనలు చేశామని తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్లకు పరిమితి లేదని, రూ. 2.50లక్షలు దాటితే మాత్రం సరైనా ఆధారాలు చూపించాల్సి ఉంటుందని చెప్పారు.