అధిష్టానం వ్యూహం: సీమాంధ్ర సిఎంగా పనబాక?
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరవుతారనే విషయంపై ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెసు ప్రభుత్వాలే ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవులపై చర్చ సాగుతోంది. ఆ పదవుల కోసం ఇప్పటికే చాలా మంది రాష్ట్ర కాంగ్రెసు నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర విభజన విషయంలో ధిక్కార స్వరం వినిపిస్తున్న సీమాంధ్ర నాయకులకు చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సీమాంధ్ర రాష్ట్రానికి ఏ పేరును ఖరారు చేస్తారనేది తెలియరాలేదు. కానీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించాలని కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని సీమాంధ్ర ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. మహిళా ఎస్సీ నేతను ముఖ్యమంత్రిగా నియమించడం ద్వారా, బిసిని పిసిసి అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాల మద్దతు సాధించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కాపు వర్గానికి చెందిన నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
కాగా, కన్నా లక్ష్మినారాయణను సీమాంధ్ర ముఖ్యమంత్రిగా, ఉత్తరాంధ్రకు చెందిన కొండ్రు మురళిని ఉప ముఖ్యమంత్రిగా నియమించే మరో ఫార్ములా కూడా అధిష్టానం వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద పెద్ద యెత్తునే అధిష్టానం దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసే ఆలోచన కూడా సాగినట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రిగా చేస్తారని అంటున్నారు. అయితే, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని డి. శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.