కాటన్ కూడా: పాల్వాయి, రాముడు మునిగితే...: ఖాన్
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును కట్టవద్దని సర్ ఆర్దర్ కాటన్ కూడా చెప్పారని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సోమవారం అన్నారు. రాజ్యసభలో పోలవరం అంశానికి సంబంధించి ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు.
ఆర్డినెన్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఆంధ్రా ఇంజనీర్ కేఎల్ రావు కూడా ప్రాజెక్టుకు బదులు బ్యారేజీ కట్టాలని సూచించారన్నారు. ప్రాజెక్టు స్థానంలో మూడు బ్యారేజీలు కట్టాలని యూఎన్ఓ ప్రతినిధులు కూడా చెప్పారన్నారు. దశల వారీగా బ్యారేజీ కడితే తాగు, సాగు నీటిలో తేడా ఉండదన్నారు.
చర్చ పొడిగింపు
బిల్లు పైన చర్చను మరో అరగంట పాటు పొడిగించారు. చర్చను పొడిగించాలని కాంగ్రెసు పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో చర్చను పొడిగించారు.
పారదర్శకత ఎక్కడుంది: భూపేందర్ సింగ్
మూడు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును కట్టాలనుకుంటే ప్రభుత్వంలో పారదర్శకత ఎక్కడ ఉన్నదని బీజేడీ ఎంపీ భుపేందర్ సింగ్ అన్నారు. ఎవరినీ సంప్రదించకుండా పోలవరం ఎలా కడతారని ప్రశ్నించారు. పారదర్శకత పాలన అంటే ఇదేనా అన్నారు. గిరిజనుల హక్కలను దెబ్బతీస్తున్నారన్నారు. ఆదివాసీల జీవితాలను హరించే హక్కు కేంద్రానికి లేదన్నారు.
రాముడి ఆలయం ముంపుకు గురైతే క్షమించరు: ఎంఏ ఖాన్
గిరిజనుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ అన్నారు. భద్రాచలంలో రాముడి ఆలయం ముంపునకు గురయితే ప్రజలు క్షమించరన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, గిరిజనులకు న్యాయం జరగాలన్నారు. పోలవరం వల్ల ఆదివాసీల జీవితాలు చిన్నాభిన్నామవుతాయన్నారు.
మాట్లాడాలి: రాందాస్ అథవాలే
నాలుగు రాష్ట్రాలతో కేంద్రం మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని రామ్ దాస్ అథవాలే అన్నారు.
డిజైన్ మార్చాలంటున్నాం: విహెచ్
తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని కోరుతున్నామని కాంగ్రెసు రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. రాజ్నాథ్ సింగ్ వ్యక్తిగతంగా పోలవరం ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి వచ్చి సమస్యలు తెలుసుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గతంలో అవినీతి జరిగిందన్నారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ప్రధాని మోడీ చెప్పారన్నారు.