తప్పు చేశావు రాందేవ్.. సారీ చెప్పు -కరోనాకు అల్లోపతి వేస్టన్న యోగాగురుపై మోదీ సర్కార్ ఫైర్ -హర్ష వర్ధన్ ప్రకటన
కరోనా మహమ్మారికి అల్లోపతి వైద్య విధానం పనికిరాదని, కొవిడ్ చికిత్సలో అల్లోపతి రోజుకో విధానాన్ని ఎత్తుకోవడం వల్లే దేశంలో మరణాలు భారీగా పెరిగాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబా ఉదంతంలో మరో పరిణామం చోటుచేసుకుంది. అల్లోపతి విధానాన్ని, డాక్టర్లను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన రాందేవ్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) లీగల్ నోటీసులు ఇవ్వడం, ఢిల్లీ పెద్దలుగానీ స్పందించకుంటే దీనిపై ప్రజాఉద్యమాన్ని లేవదీస్తామని డాక్టర్లు హెచ్చరించడంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది..
Recommended Video
అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తించాయి. కరోనా వైరస్ కంటే అల్లోపతి వంటి ఆధునిక చికిత్స వైద్య విధానాలే ప్రజలను బలిగొంటున్నాయని రాందేవ్ వ్యాఖ్యానించారు. దీనిపై వైద్య వర్గాలు భగ్గుమనడంతో రాందేవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అల్లోపతిని అవమానించలేదని, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ను మాత్రమే ఆయన చదివాడని పతంజలి సంస్థ కవరింగ్ ఇచ్చుకుంది. దీనికి ఐఎంఏ సంతృప్తి చెందికపోవడంతో కేంద్రమే రంగంలోకి దిగింది. రాందేవ్ వివరణ ఇస్తే సరిపోదని, తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
''అల్లోపతి వైద్యంపై మీరు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ విషయాన్ని మీకు ఇప్పటికే ఫోన్ ద్వారా తెలియజేశాను. ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిని దేశ ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు. మీరు కరోనా వారియర్స్ ను మాత్రమే అవమానించలేదు... యావత్ ప్రజానీకం మనోభావాలను గాయపరిచారు. మీరు నిన్న ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదు. మీరు దీనిపై గట్టిగా ఆలోచించి, మీ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాను'' అంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ఆదివారం రాత్రి రాందేవ్ కు హిందీలో రెండు పేజీల లేఖ రాశారు.
viral video: కలెక్టర్ శర్మ ఓవరాక్షన్ -లాక్డౌన్ పేరిట యువకుడిపై దాడి -వేటేసిన సీఎం -క్షమించాలంటూ..
అల్లోపతిపై రాందేవ్ బాబా చేసిన ఆరోపణలను అంగీకరించి ఆధునిక వైద్యానికి స్వస్తి పలకడం లేదా అంటువ్యాధుల చట్టం కింద ఆయనను ప్రాసిక్యూట్ చేయాలని ఐఎంఏ ఓ ప్రకటనలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ను డిమాండ్ చేయడం, యోగా గురుకు లీగల్ నోటీసులు కూడా పంపడం తెలిసిందే. ఎట్టకేలకు కేంద్రం జోక్యం చేసుకోవడంపై ఐఎంఏ హర్షం వ్యక్తం చేసింది. డాక్టర్ల మనోభావాలను గౌరవించి, రాందేవ్ ను వెనక్కి తగ్గాలని సూచించిన హర్ష వర్ధన్ కు ఐఎంఏ ప్రతినిధులు ధన్యవాదాలు చెప్పారు.