అమిత్ షాకు ఝలక్! రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించి.. మద్దతు కోరమన్న ఉద్ధవ్ ఠాక్రే
రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎంతో ఆశతో తన గుమ్మాన్ని తొక్కిన బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఝలక్ ఇచ్చారు.
ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం ఎంతో ఆశతో తన గుమ్మాన్ని తొక్కిన బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు మిత్రపక్షం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఝలక్ ఇచ్చారు. ముందు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయండి.. ఆ తర్వాతే మద్దతు కోరండని అమిత్ షాకు ఠాక్రే తేల్చిచెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దీంతో ఎన్నో అంచనాల మధ్య సాగిన అమిత్షా-ఉద్ధవ్ ఠాక్రే భేటీ అసంపూర్ణంగా ముగిసింది. రాష్ట్రపతి అభ్యర్థుల విషయమై శివసేన ఇప్పటికే ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అమిత్ షా-ఠాక్రే మధ్య 75 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఉద్ధవ్తోపాటు ఆయన కొడుకు ఆదిత్య, షాతోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడవ్నిస్ కూడా పాల్గొన్నారు.
పేరుకు మిత్రపక్షాలైనా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన బంధం ఉప్పు-నిప్పులా కొనసాగుతోంది. ఇటీవల రుణమాఫీ విషయమై బాహాటంగానే బీజేపీ సర్కారుపై సేన నిప్పులు కురిపించింది. ఈ నేపథ్యంలో జరిగిన అమిత్ షా-ఉద్ధవ్ ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఎన్డీఏ భాగస్వాముల్లో దాదాపు అందరూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కట్టబెట్టారని, ఈ విషయంలో శివసేన కూడా తమతో కలిసి రావాలని అమిత్ షా తెలుపగా, ఉద్దవ్ ఠాక్రే ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
తాము ఇప్పటికే ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ పేర్లను రాష్ట్రపతి అభ్యర్థిగా సూచించామని, బీజేపీ ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఎంపిక చేయడమో, లేదంటే.. మరో అభ్యర్థిని సూచించడమో చేయాలని, అభ్యర్థిని మొదట ఖరారు చేస్తే.. మద్దతు విషయం తాము ఆలోచిస్తామని ఉద్దవ్ తేల్చి చెప్పినట్లు సమాచారం.