"జయ, శశికళల వీడియోను బయటపెడ్తా, ఆలా చూడొద్దనే..."
జయలలిత, శశికళల మధ్య జరిగిన సంభాషణల వీడియోను తాను బహిర్గతం చేస్తానని శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయకుమార్ అన్నారు.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె శశికళతో సాగించిన సంభాషణల వీడియోను బయటపెడతానని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ సోదరుడు దివాకరన్ కుమారుడు జయానంద్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
మాజీ సీఎం పన్నీర్సెల్వం వర్గం జయ మరణంపై సందేహాలను వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆ విషయం వెల్లడించారు. హత్య ఆరోపణలు చేసినప్పటికీ జయ చికిత్స పొందిన ఫోటోలను బహిర్గతం చేయలేదని, పచ్చగౌను దుస్తుల్లో అమ్మను శత్రువులు చూడరాదన్నదే ఏకైక కారణం వల్లనే ఆ పనిచేశారని అన్నారు.
ఇది త్యాగమూర్తి చిన్నమ్మ చేసిన పని అని ఆయన కొనియాడారు. సింహాన్ని సింహంలాగే స్వర్గలోకం పాలించేందుకు రాచమర్యాదలతో పంపించామని చెప్పారు. కానీ ఓపీఎస్ కేవలం ఓట్ల కోసం పురచ్చితలైవిని శవపేటికలో పెట్టి ప్రచారం చేశారని అన్నారు.
నిజం నిప్పులాంటిదని, ఏదో ఒక రోజున అమ్మ, చిన్నమ్మ (శశికళ) మధ్య ఆస్పత్రిలో జరిగిన సంభాషణలు బయటకు వస్తే పీహెచ్ పాండ్యన్, మనోజ్ పాండ్యన్, పన్నీర్సెల్వం వంటి వారిని ఏం చేయాల్సి ఉంటుందోనని అంటూ ఆ రోజు త్వరలోనే..! అని జయానంద్ అన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలకు తననెవరూ ఉరి తీయలేరని, మహా అయితే జైలులో మాత్రమే పెట్టగలరని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు.