ఎగ్జిట్ పోల్స్కి ప్రాముఖ్యత ఉందా..? లెక్క తప్పుతున్నప్పటికి ఎందుకీ హడావిడి..?
Recommended Video
ఓ ప్రహసనం ముగిసింది. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇంకేముంది ఎగ్జిట్ పోల్స్ పేరుతో వివిధ ఛానల్స్ తో ప్రయివేటు సంస్థలు జరిపిన సర్వేలను బహిర్గతం చేసాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఏ పార్టీ, ఏ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుందని తేల్చిచెప్పాయి. కేంద్రంలో దాదాపు అన్ని ఎగ్జిట్పోల్స్ కూడా ఎన్డీయే విజయమని చెప్పగా.. ఆంధ్రప్రదేశ్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. కొన్ని సంస్థలు ముఖ్యంగా జాతీయ మీడియాకు అనుంబంధంగా పనిచేసిన సంస్థలు వైసీపీకి అనుకూలంగా చెప్పగా మరికొన్ని సంస్థలు టీడీపీనే మళ్లీ అధికారం చేపడుతుందని చెప్పాయి. అసలు ఎగ్జిట్పోల్స్లో ఎందుకింత గందరగోళం..? ఒక సంస్థ ఒకలా.. మరొక సంస్థ మరొకలా ఫలితాలు ఎందుకు ఇస్తోంది..? అసలు ఎగ్జిట్పోల్స్ను నమ్మొచ్చా లేదా.. వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం..!
ఎగ్జిట్పోల్స్పై విశ్వసనీయత ఉండొచ్చా..! విరుద్ద ఫలితాలు ఎలా ప్రకటిస్తాయి..!!
ఎన్నికలకు ముందే ఫలితాలు పసిగట్టామని కొన్ని మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్పోల్ను విడుదల చేస్తుంటాయి. ప్రధానంగా జాతీయ మీడియా వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి. అంచనాలు కనుక దరిదాపుల్లోకి వచ్చినా.. ఒకవేళ నిజమైనా ఫలితాల రోజు తమ అంచనాలు, సర్వేలు నిజమయ్యాయని ఊదరగొడుతుంటాయి. వీక్షకుల నుంచి విశ్వసనీయత పెంచుకునేందుకు ఇదొక సాధనంగా వాడుకుంటాయి. నిజానికి మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమా.. కాదా అని ఆలోచించే ముందు పోలింగ్ ముగిసేవరకు ఎగ్జిట్పోల్స్ ఎందుకు వెల్లడించకూడదనే నిబంధన వచ్చిందో తెలుసుకోవాల్సి అవసరం ఎంతో ఉంది. దేశంలో చాలావరకు మీడియా సంస్థలు ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా కార్పొరేట్ సంస్థకు అనుబంధంగా పని చేస్తున్నాయి.
లెక్క తప్పుతున్న అంచనా..! ఐనా ఎక్కడలేని హడావిడి..!!
ఆయా రాజకీయ పార్టీలు లేదా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగానే ఫలితాలు, వార్తలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఎన్నికల ముందు ఎగ్జిట్పోల్స్ పేరిట ఫలితాలు విడుదల చేసి, తటస్థ ఓటర్లనే గందరగోళానికి గురిచేయడం పరిపాటిగా మారింది. ఎవరికి అనుకూలంగా ఉన్న పార్టీకి వారు అనుకూలంగా ఫలితాలు ఇస్తుండటంతో ఎన్నికలలో ఆ ప్రభావం తటస్థ ఓటర్లపై పడి ఫలితాలు తారుమారు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పదేళ్ల కిందట సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్ ముగిసే వరకు ఎగ్జిట్పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఇంత జరిగినా.. మన దేశంలో ప్రజల నాడి పసిగట్టడంలో ఎగ్జిట్పోల్స్ ఇప్పటికీ విఫలమవుతూనే వస్తున్నాయి. దీంతో అవి ప్రజల విశ్వసాన్ని పోగొట్టుకుంటున్నాయి.
శాంపిల్స్ ఎక్కడ, ఎప్పుడు, ఎవరు సేకరిస్తారో తెలియదు..!
ఇదే కాదు.. దాదాపు ప్రపంచమంతా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా ఎన్నికలలో లిబరల్ కూటమి గెలవదని 23 సర్వేలు ముక్తకంఠంతో చెప్పాయి. వారి అంచనాలు తలకిందులు చేస్తూ లిబరల్ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చి ఎగ్జిట్పోల్స్ ఒట్టి బోగస్ అని తేల్చి చెప్పింది. రెండేళ్ల కింట అమెరికా ఎన్నికలు ఇదే స్పష్టం చేశాయి. ట్రంప్ గెలవరని ఎగ్జిట్పోల్స్ స్పష్టంగా చేయగా.. క్లింటన్కు మద్దతు తెలపగా.. దానికి విరుద్ధ ఫలితం అమెరికాలో ఆవిష్కృతమైంది. బ్రెగ్జిట్ సమయంలోనూ ఇదే స్పష్టమైంది. మెజార్టీ ప్రజలు బ్రెగ్జిట్కు అనుకూలంగా తీర్పు చెప్పి ఎగ్జిట్పోల్స్ అంచనాలు తప్పు అని రుజువు చేశారు.
గత మూడు ఎన్నికల్లో ఘోరంగా తప్పిన లెక్కలు..! ఈ సారి కూడా నెలకొన్న అయోమయం...!!
ఇక మనదేశానికి వచ్చే సరికి 2004 నుంచి ఎగ్జిట్పోల్స్ అంచనాలు తప్పుతూనే ఉన్నాయి. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ ఎవరికి మొగ్గు చూపితే.. వారు పరాజయం పాలవ్వడం జరగుతోంది. 2004లో బారత్ వెలిగిపోతోందనే నినాదంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. ఈ సందర్భంగా సగటున ఎన్డీయే 252 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్పోల్స్ చెప్పాయి. కానీ ఎన్డీయే కూటమి 185 స్థానాలకే పరిమితం అయ్యింది. యూపీయే కూటమి అధిక స్థానాలు సాధించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇక 2009లో ఎన్డీయేకు 187 స్థానాలు, యూపీయేకు 196 స్థానాలు వస్తాయని సగటుగా ఎగ్జిట్పోల్స్ అంచనా వేశాయి. ఈ ఫలితాలు తలకిందులయ్యాయి. ఎన్డీయే 159, యూపీయే 262 సీట్లు సాధించాయి. ఇక 2014లో ఎన్డీయే కూటమికి 274 స్థానాలు దక్కుతాయని ఎగ్జిట్పోల్స్ సగటుగా ఉంది. కానీ బీజేపీ ఒక్కటే 282 స్థానాలు సాధించింది. ఎన్డీయే కూటమి 336 స్థానాలు దక్కించుకుంది. గతేడాది జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ల్ బీజేపీదే విజయమని మెజార్టీ ఎగ్జిట్పోల్స్ చెప్పాయి. కానీ అనుహ్యంగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదనే దిశగా సగటు ఓటర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.