యూపీఎస్సీలో కీలక మార్పు: కొత్త ఛైర్మన్ నియామకం: అత్యున్నత బ్యూరోక్రాట్లను అందించే వ్యవస్థగా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్లు, డిప్లొమాట్లను నిర్దేశించే అత్యున్నత వ్యవస్థ. ఐఎఎస్, ఐపీఎస్.. వంటి అత్యున్నత స్థాయి అధికారులను దేశానికి అందించే ప్రతిష్ఠాత్మకమైన విభాగం. ఇందులో కీలక మార్పు చోటు చేసుకుంది. యూపీఎస్సీకి కొత్త ఛైర్మన్ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. విద్యావేత్త ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ జోషిని యూపీఎస్సీ ఛైర్మన్గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
ఇప్పటిదాకా ఈ కమిషన్ ఛైర్మన్గా అరవింద్ సక్సేనా పని చేశారు. ఆయన పదవీ కాలం శుక్రవారం నాటితో ముగిసింది. దీనితో ప్రదీప్ కుమార్ జోషిని నియమించింది. వచ్చే ఏడాది మే 31వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇదివరకు ప్రదీప్ కుమార్ జోషి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా వ్యవహరించారు. అనంతరం 2015లో యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులు అయ్యారు. ఇక ఛైర్మన్ స్థానాన్ని అందుకున్నారు.
ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు ఉద్యోగులను నియమించడానికి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో యూపీఎస్సీ మూడు దశల్లో పరీక్షలను నిర్వహిస్తుంటుంది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపూరకమైనవి కాగా.. మరొకటి మౌఖిక పరీక్ష. అఖిల భారత సర్వీసులను ఎంపిక కావాలనుకునే అభ్యర్థుల్లోని ప్రతిభను వెలికి తీసేలా.. అందులోనూ అత్యంత ప్రతిభావంతులను వడపోసేలా పరీక్షా విధానాలను ఉంటాయి.
Recommended Video
అలాంటి ప్రతిష్ఠాత్మక కమిషన్కు ఛైర్మన్గా వ్యవహరించడమనేది అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తుంటారు. ప్రస్తుతం యూపీఎస్సీలో భీమ్సేన్ బస్సీ, ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) ఏఎస్ బోంస్లే, సుజాతా మెహతా, మనోజ్ సోని, స్మితా నాగరాజ్, ఎం సత్యవతి, భరత్ భూషణ్ వ్యాస్, టీసీఏ అనంత్, రాజీవ్ నారాయణ్ చౌబే సభ్యులుగా కొనసాగుతున్నారు. వారిలో ఒకరిగా ఉన్న ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ జోషి ఛైర్మన్గా ఎన్నిక అయ్యారు. ఫలితంగా ఒక సభ్యుడి స్థానం ఖాళీగా మారింది. రాష్ట్రాల స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా పనిచేసిన వారిని యూపీఎస్సీ సభ్యునిగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది.