కడిగేరేశారు: మమతా బెనర్జీ, ఆ స్థానం కాంగ్రెస్ భర్తీ!
కోల్కతా: తన గెలుపు పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. విపక్షాలు తమపై ఎంతగా విమర్శలు చేసినా బెంగాల్ ప్రజలు వాటిని విశ్వసించలేదన్నారు. పోలింగ్ ఫలితాలు తృణమూల్కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆమె మాట్లాడారు.
తృణమూల్కు ఇది అపూర్వ విజయమని చెప్పారు. విపక్షాలు చల్లిన బురదను ప్రజలు తమ ఓట్ల వెల్లువతో కడిగేశారన్నారు. బెంగాలీలు చిరునవ్వులు చిందించినప్పుడే తనకు ఆనందం కలుగుతుందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని కానుకగా ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడైన అనంతరం మరోసారి మాట్లాడతానని తెలిపారు.
కాంగ్రెస్ చేతిలో లెఫ్ట్కు షాక్
బెంగాల్లో ఇప్పటిదాకా తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్ పార్టీగా ఉంది. అయితే, ఈసారి లెఫ్ట్ పార్టీకి మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ ద్వారా షాక్ తగిలింది. బెంగాల్లో మమతా బెనర్జీ ఒంటరిగా పోటీ చేశారు. లెఫ్ట్ - కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి.
2011లో తృణమూల్కు 184, లెఫ్ట్కు 40కి పైగా, కాంగ్రెస్కు 42 సీట్లు వచ్చాయి. అయితే, ఈసారి కాంగ్రెస్ పార్టీతో కలవడంతో లెఫ్ట్ పార్టీకి కూడా తక్కువ సీట్లు వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కువ సీట్లు కోల్పోలేదు. కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో ముందంజలో లేదా గెలిచింది. అదే సమయంలో లెఫ్ట్ 30 స్థానాల్లో ముందంజలో లేదా గెలిచింది.