కర్మకు బాధ్యులు వారే.. హరీశ్ రావత్ ఇష్యూపై అమరీందర్
కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ అధిష్ఠానంపై చేసిన కామెంట్లపౌ కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రియాక్ట్ అయ్యారు. ఎవరి కర్మ వారు అనుభవించాల్సిందే. ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఆల్ ది బెస్ట్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు అమరీందర్ సింగ్. హరీశ్ రావత్ బుధవారం ఒక్కసారిగా పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే తనను ఈదమంటున్నారో... వారే తన కాళ్లు, చేతులు కట్టిపారేశారని అధిష్ఠానంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
తన విషయంలో పార్టీ తీవ్ర వివక్షతను చూపుతోందని మండిపడ్డారు. చూడండి.. ఎంత చిత్రమో.. ఎన్నికలన్న సముద్రంలో ఈదమన్నారు. ఈదడానికి తగిన మద్దతివ్వాల్సింది పోయి... వెన్నుపోటు పొడుస్తోంది సంస్థ. నాకు వ్యతిరేకంగా పాత్ర పోషించడానికి సిద్ధపడిపోయింది. ఈత కొట్టమని దించేశారు. దాంతో పాటు కొన్ని మొసళ్లను కూడా జారవిడిచారు. కాళ్లు, చేతులు కట్టేసి ఈత కొట్టమంటున్నారు. అలిసిపోయా.. ఇక చాలనిపిస్తోంది. విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఓ దారిని చూపిస్తుందని ఆశాభావంతోనే ఉన్నా. కేదారేశ్వరుడు ఓ కొత్త మార్గాన్ని చూపిస్తాడని విశ్వాసంతోనే ఉన్నానని హరీశ్ రావత్ ట్వీట్ చేశారు.
అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేస్తామని మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటును చేపడతాయని అమరీందర్ ట్వీట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 శాతం తాము విజయం సాధిస్తామని కెప్టెన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. సీట్ల పంపిణీ ఇంకా జరగలేదని.. అయినప్పటికీ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం పక్కా అని షెకావత్ తెలిపారు. సీట్ల పంపకం అనేది విజయాన్ని బట్టి ఉంటుందని అమరీందర్ సింగ్ తెలియజేశారు. తమ కూటమి విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.