శారదా స్కామ్: కాల్చుకుని మాజీ డిజిపి ఆత్మహత్య?
న్యూఢిల్లీ: శారదా కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న అస్సాం మాజీ డిజిపి శంకర్ బారువా మరణించారు. గౌహతిలోని తన నివాసంలో ఆయన బుధవారం మరణించి కనిపించారు. బహుశా ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అంటున్నారు.
శంకర్ బారువా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రివాల్వర్తో కాల్చుకుని ఉంటాడని వార్తలు వచ్చాయి. శారదా స్కామ్కు సంబంధించిన సిబిఐ అధికారులు రెండు వారాల క్రితం శంకర్ బారువా ఇంటిలో సోదాలు నిర్వహించారు.
సిబిఐ అధికారులు గౌహతిలోని 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో శంకర్ బారువా నివాసంలో కూడా సోదాలు జరిపారు. బారువాను సిబిఐ అధికారులు ప్రశ్నించారు కూడా. బారువా రివాల్వర్తో కాల్చుకుని మరణించినప్పుడు ఆయన 90 ఏళ్ల వయస్సు గల తల్లి ఇంట్లోనే ఉందని చెబుతున్నారు.
నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్న బారువా బుధవారంనాడే ఇంటికి తిరిగి వచ్చారు. విచారణలో సిబిఐ అధికారులు అవమానించినందుకు మనస్తాపానికి గురయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శారద చిట్ఫండ్స్ కుంభకోణంలో సిబిఐ 48 కేసులు నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్లో నాలుగు కేసులు, ఒడిషాలో 44 కేసులు నమోదు చేసింది.