హై అలెర్ట్: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపు వద్ద ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి; చెక్ పోస్టుల వద్ద తనిఖీలు!!
భారత దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పహారా కాస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఉగ్ర మూక భారత భద్రతా దళాలపై దాడులకు ప్రయత్నాలు సాగిస్తోంది. కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే భారతదేశంలోకి అనేక రహస్య మార్గాల ద్వారా చొరబడిన ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతా బలగాలు నిత్యం కూంబింగ్ ఆపరేషన్లను చేస్తూనే ఉన్నాయి. బోర్డర్ లో భద్రతను మరింత పెంచాయి. అయినప్పటికీ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
పఠాన్ కోట్ ఆర్మీ క్యాంపు వద్ద గ్రనేడ్ బ్లాస్ట్ .. ఆర్మీ అలెర్ట్
తాజాగా పంజాబ్ లోని పఠాన్ కోట్ లోని ఆర్మీ క్యాంపు ఒక్కసారిగా గ్రనేడ్ పేలుడుతో ఉలిక్కిపడింది. పంజాబ్లోని పఠాన్కోట్లోని ఆర్మీ క్యాంపు త్రివేణి గేట్ సమీపంలో గ్రనేడ్ పేలుడు సంభవించింది. మిలటరీ హై సెన్సిటివ్ ఏరియా పఠాన్ కోట్ వద్ద గ్రనేడ్ బ్లాస్ట్ జరగడంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి దగ్గర్లో ఒక వివాహ వేడుక జరుగుతున్న నేపథ్యంలో, బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ గ్రనేడ్ విసిరినట్లుగా చెబుతున్నారు.
ఎలాంటి ప్రాణ హాని లేదు, సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలన
పఠాన్ కోట్ నుంచి వెళ్లే అన్ని మార్గాలలో ఉన్న చెక్ పోస్టుల వద్ద హై అలెర్ట్ పెట్టిన పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఘటన చోటు చేసుకున్న గేట్ వద్ద సిసి టివి ఫుటేజ్ ను భద్రతా సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రనేడ్లోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై ప్రస్తుతం అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఘటనకు గల కారణాలను, ఘటనకు గల బాధ్యులను పట్టుకోవడం కోసం దర్యాప్తు చేస్తున్నారు.
ఐదేళ్ళ క్రితం పఠాన్ కోట్ లో వైమానిక దళ స్థావరంపై ఉగ్ర దాడి
ఐదు సంవత్సరాల క్రితం, పఠాన్కోట్లోని భారత వైమానిక దళ స్థావరంపై ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు, వారు డిసెంబర్ 30-31, 2015 రాత్రి పాకిస్తాన్ నుండి పంజాబ్లోని కతువా-గురుదాస్పూర్ సరిహద్దు ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు. జనవరి 1, 2016న, ఎయిర్ బేస్ సమీపంలోకి వెళ్లేందుకు ఉగ్రవాదులు పంజాబ్ టాప్ కాప్ సల్వీందర్ సింగ్ ఎస్యూవీని హైజాక్ చేశారు. జనవరి 2న దాడులు ప్రారంభమయ్యాయి, అయితే దాడి జరుగుతున్న నేపథ్యంలో కాప్టర్లు, రాకెట్లతో భద్రతా దళాలు థర్మల్ ఇమేజింగ్ సహాయంతో ఉగ్రవాదులను గుర్తించాయి. మూడు రోజుల పాటు సాగిన కాల్పుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు, అయితే ఈ పోరాటంలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు.
జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో పేలుడు ఘటన, ఆపై పఠాన్ కోట్ లో కదలికలు
ఈ ఏడాది జూన్లో జమ్మూ ఎయిర్ఫోర్స్ స్టేషన్లోని హైసెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. జమ్మూ ఎయిర్ఫీల్డ్లో జరిగిన రెండు పేలుళ్లలో పేలోడ్తో కూడిన డ్రోన్ పేలుడు పదార్థాన్ని జారవిడిచాయి. ఐఈడీలను జారవిడిచేందుకు మాత్రమే డ్రోన్ను ఉపయోగించినట్టు భద్రతా దళాలు గుర్తించాయి. జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన ఒక నెల లోపే, జులై నెలలో పఠాన్కోట్లో భద్రతా సిబ్బందికి అనుమానాస్పద బెలూన్ ఒకటి కనిపించింది.
అక్టోబర్ 6న అనుమానాస్పద డ్రోన్ కదలికలు
అక్టోబర్ 6న పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోని బమియాల్ సెక్టార్లోని జైత్పూర్ పోస్ట్ సమీపంలో డ్రోన్ కనిపించింది. డ్రోన్ ను గుర్తించిన సరిహద్దు భద్రతా దళం (BSF) జవాన్లు డ్రోన్పై కాల్పులు జరిపారు. నాలుగు నుండి ఐదు రౌండ్లు కాల్చారు. దీంతో డ్రోన్ అక్కడినుండి వెళ్ళిపోయింది . దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లకు ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం తలకు మించిన భారంగా తయారైంది. ఉగ్ర దాడులను అడ్డుకోవటం కోసం ప్రస్తుతం నిరంతర నిఘా కొనసాగుతుంది.