హిమాచల్ పోరు: రాజపుత్రులే రాజులు.. కింగ్ మేకర్లు బ్రాహ్మణులు
తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజపత్రులు 1995లో ఆధిపత్య పాత్ర పోషించారు.
సిమ్లా: తొలి నుంచి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజపత్రులు 1995లో ఆధిపత్య పాత్ర పోషించారు. రాష్ట్రంలోని రాజకీయ నాయకులు విజయావకాశాలను కులాలు దెబ్బ తీయకున్నా పర్వత శ్రేణులకు నిలయమైన హిమాచల్ప్రదేశ్లో అవి కీలక భూమిక పోషించాయి. ప్రత్యేకించి రాజపుత్రులు అధికార దండం చేపడితే.. బ్రాహ్మణులు కీలక వ్యూహకర్తలుగా నిలిచారు. ఎన్నికలు ముందుకు వచ్చిన ప్రతిసారీ కులాలకు అతీతంగా ఆయా పార్టీ శ్రేణులు అభిమానంతో, ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటాయి.
జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్న దళితులు కేవలం ఓటుబ్యాంకుకు మాత్రమే పరిమితం అయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాన్ని ఖరారుచేస్తున్నాయి. కులాలకు అతీతంగా ఇది కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం అభ్యర్థుల ఎంపికలో నియోజకవర్గాల వారీగా సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
దళితులకు రెండోస్థానం అయినా ఓటుబ్యాంకే
2011 జన గణన ప్రకారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర జనాభా 68,56,509 మంది. వారిలో 25.22 శాతం మంది (17,29,252) ఎస్సీలు, 5.71 శాతం మంది (3,92,126) గిరిజనులు, 13.52 శాతం మంది (9,27, 452) ఇతర ఓబీసీ వర్గాల వారు ఉన్నారు. మిగతా జనాభా అంతా అగ్ర కులాల వారే 50.72 శాతం. ఇతర సామాజిక వర్గాలు 4.83 శాతం మంది ఉన్నారు. అగ్రకులాల వారు గల 50.72 శాతం మందిలో రాజపుత్రులు 32.72 శాతం మంది, 18 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నారు. 68 స్థానాలు గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో 20 స్థానాలు రిజర్వు చేయగా, 17 ఎస్సీలకు, మూడు ఎస్టీలకు కేటాయించారు.
నాలుగుసార్లు ఇలా వైఎస్ పర్మార్ సీఎంగా బాధ్యతలు
పర్వత శ్రేణులకు నిలయమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 1952 నుంచే రాజపుత్రులదే హవా. 1952లో రాష్ట్ర తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యశ్వంత్ సింగ్ పర్మార్ వరుసగా నాలుగు సార్లు పదవిలో కొనసాగారు. రాష్ట్రాన్ని పరిపాలించిన ఐదుగురు సీఎంల్లో నలుగురు రాజపుత్రులే కావడం గమనార్హం. రాజపుత్రుడిగా ప్రస్తుత సీఎం వీరభద్ర సింగ్ ఆరుసార్లు 22 ఏళ్ల పాటు పాలన సాగించారు. తర్వాత ఠాకూర్ రామ్లాల్, ప్రేమ్ కుమార్ ధుమాల్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన వారే.
పార్టీ అధ్యక్షులు కూడా రాజపుత్రులు, బ్రాహ్మణులే
ఇక బీజేపీ నుంచి సీఎంగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన శాంతా కుమార్ 1977 - 1980, 1990 - 1992 మధ్య పనిచేసిన ఏకైక బ్రాహ్మణ సామాజిక వర్గ నేత. మండీ, సిమ్లా, కుల్లు, హమీర్పూర్, కంగ్రా జిల్లాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో రాజపుత్రుల జనాభా గణనీయ స్థాయిలో ఉన్నది. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే కాంగ్రెస్, బీజేపీల రాష్ట్ర శాఖల అధ్యక్షులుగానూ రాజపుత్రులు, బ్రాహ్మణులే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షులు సుఖ్వీందర్ సింగ్ సుఖు (హెచ్పీసీసీ), సత్పాల్ సింగ్ సత్తి (బీజేపీ) కూడా రాజపుత్రులే గమనార్హం.
సుఖ్ రాంతో ఆనంద శర్మ ఇలా పోటీ
రాజపుత్రులు, ఎస్సీల తర్వాత హిమాచల్ రాజకీయాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన సామాజిక వర్గం వారు బ్రాహ్మణులే. బ్రాహ్మణ సామాజికవర్గ నేతల్లో కొందరు ప్రముఖులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెసేతర సీఎంగా శాంతారాం రికార్డు నెలకొల్పారు. ఇక టెలికం ఫాదర్గా సుఖ్ రాం, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రభాత్ నడ్డా, కేంద్ర మాజీ మంత్రి ఆనందశర్మ వంటి వారు బ్రాహ్మణ సామాజిక వర్గ నేతలు. సుఖ్రామ్ ఒకప్పుడు సీఎంగా కావడానికి రంగం సిద్ధం కాగా, ఆనంద శర్మ కూడా పోటీ పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి సుఖ్ రాం ఆధ్వర్యంలో ఇలా హెచ్వీసీ ఏర్పాటు
కానీ ఈ వీరభద్రుడు రంగ ప్రవేశం చేసి సుఖ్రాం, ఆనందశర్మ మధ్య తాత్కాలికంగా ఘర్షణ నివారించారు. దీంతో సుఖ్ రాం కాంగ్రెస్ పార్టీని వీడి హిమాచల్ వికాస్ కాంగ్రెస్ పార్టీ (హెచ్వీసీ)ని 1997లో స్థాపించారు. తదుపరి ప్రేమ్ కుమార్ ధుమాల్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మూల కారణంగా నిలిచింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సీఎం పదవికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఇక సుఖ్ రాం తనయుడు అనిల్ శర్మ కూడా బీజేపీలో చేరారు. శాంతాకుమార్ మినహా బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలెవ్వరు సీఎంలు కాలేదు. కానీ కింగ్ మేకర్లుగా వ్యవహరించారు. అంతే కాదు శాంతకుమార్ ప్రాతినిద్యం వహించిన రెండు ప్రభుత్వాలు పూర్తిగా పదవిలో కొనసాగలేదు.
తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఓబీసీలే కీలకం
కంగ్రా జిల్లాల్లో 55 శాతానికి పైగా జనాభా ఓబీసీలే. రాష్ట్ర వ్యాప్తంగా 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓబీసీలు కీలక పాత్ర పోషిస్తుండగా, కంగ్రా జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఓబీసీలే నిర్ణయాధికారం కలిగి ఉన్నారు. కంగ్రా జిల్లాలోని 15 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఓబీసీలు. ప్రస్తుత వీరభద్ర సింగ్ ప్రభుత్వంలో జవాలీ ఎమ్మెల్యే నీరజ్ భారతి, సులాహ్ ఎమ్మెల్యే జగ్జీవన్ పాల్.. చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్)గా వ్యవహరిస్తున్నారు. ఉనా జిల్లాలో 15.01 %, హమీర్పూర్లో 7.83, సిర్మౌర్లో 6.86, సొలాన్ జిల్లాలో 4.25 శాతం మంది ఓబీసీల జనాభా ఉన్నారు. ఓబీసీలు మూకుమ్మడిగా ఓటేస్తే ఏ రాజకీయ పార్టీపైనైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది.
వీరభద్రుడి క్యాబినెట్లో ఏకైక దళిత మంత్రి
జనాభా ప్రాతిపదికన చూస్తే రాజపుత్రుల తర్వాత స్థానంలో దళితులు ఉన్నా వారు ఆయా రాజకీయ పార్టీల ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నారు. రిజర్వు చేసిన 17 అసెంబ్లీ స్థానాలు మినహా ఇతర అసెంబ్లీ స్థానాల పరిధిలో దళిత అభ్యర్థులను ఏ పార్టీ కూడా బరిలో నిలుపలేదు. ప్రభుత్వోద్యోగాలు, వ్యాపారాలు, రైతులు, ఉద్యానవేత్తల్లోనూ, రాజకీయ పార్టీల నాయకులుగానూ దళితులు గణనీయంగానే ఉన్నారు. కానీ అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాల్సి వచ్చే సరికి వారి పాత్ర చాలా నామమాత్రంగా మారింది. ప్రస్తుతం వీరభద్రసింగ్ క్యాబినెట్ లో కేవలం ఒక్కరు మాత్రమే దళితుడు. ఏ ఒక్క దళిత నాయకుడు కూడా సీఎం పదవి స్థాయికి చేరుకోలేదు.
గడ్డీల ప్రాబల్యం ఇలా
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సామాజిక వర్గాల్లో గడ్డీలు ఉన్నారు. చాంబా, కంగ్రా జిల్లాల్లో గడ్డీలదే కీలక పాత్ర. అయినా ప్రస్తుతం క్యాబినెట్లో గడ్డీ సామాజికవర్గం నుంచి థాకర్ సింగ్ భామౌరీ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కంగ్రా, చాంబా జిల్లాల్లోని 12 అసెంబ్లీ స్థానాల పరిధిలో గడ్డీ గిరిజనులదే కీలక పాత్ర అంటే అతిశయోక్తి కాదు. కిన్నౌర్ నుంచి శక్తి సామర్థ్యాలు గల నేతగా ఠాకూర్ సెన్ నెగీ అత్యధిక కాలం స్పీకర్గా సేవలందించారు.