హిట్ అండ్ రన్ కేసు: దంపతులను కారుతో ఢీకొట్టి చంపిన మహిళా ఐఏఎఫ్
బరేలీ: ఓ ఐఏఎఫ్(భారత వాయుసేన) అధికారిణి తన కారులో వేగంగా వచ్చి ఓ వృద్ధ దంపతులను ఢీకొట్టింది. దీంతో ఆ దంపతులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా, ఆ అధికారిణి అక్కడ ఆగకుండా పారిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని ఇజ్జత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
మృతుల బంధువుల కథనం ప్రకారం.. కారుతో ఢీకొట్టిన అనంతరం ఆ అధికారిణి కారు పక్కన పెట్టేసి పారిపోయింది. నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మృతుల బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ అధికారిణి ఎవరనేది ఇంకా గుర్తించలేదు.
నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలి కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. టివోఐ కథనం ప్రకారం.. మృతులు 60ఏళ్ల నాథు భక్షు, అతని భార్య తమీజాన్(55) ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్లాం మియాన్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
విమాన లెఫ్ట్నెంట్గా పని చేస్తున్న నిందిత ఐఏఎఫ్ అధికారిణి తన కారులో వేగంగా వచ్చి ఎదురుగా ఉన్న ఆ దంపతులను ఢీకొట్టింది. ఆ దంపతులు రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఐఏఎఫ్ అధికారిణి ఘటనా స్థలం నుంచి పారిపోయింది.
కాగా, గమనించిన స్థానికులు ఆ దంపతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందిత అధికారిణిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని మృతుల కూతురు ఆరోపించింది. అన్ని ఆధారాలున్నప్పటికీ నిందితురాలిని అరెస్ట్ చేయడం లేదని తెలిపింది. నిందితురాలిని వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.