గాడిదలే స్ఫూర్తి: అఖిలేష్కు నరేంద్ర మోడీ సూపర్ కౌంటర్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దన్న ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుజరాత్ గాడిదలకు ప్రచారం చేయొద్దన్న ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ మంచి కౌంటర్ ఇచ్చారు.
గురువారం బహ్రాయిచ్లో జరిగిన 'బీజేపీ విజయ శంఖానాద ర్యాలీ'లో ప్రధాని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యల్ని లౌక్యంగా తిప్పికొట్టారు. 'గుజరాత్ గాడిద'లంటే అఖిలేశ్ భయపడుతున్నారనీ, జంతువులపైనా ఆయనకున్న కులతత్వ భావాన్ని, విద్వేషాన్ని ఆ వ్యాఖ్య చాటుతోందని మోడీ చెప్పారు.అఖిలేశ్ విమర్శలు అతడి నిజ స్వరూపాన్ని బయటపెట్టాయని ప్రధాని దుయ్యబట్టారు.
'ఎన్నికల్లో ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. అందులో భాగంగానే మోడీ, బిజెపిపై అఖిలేశ్జీ విమర్శలు చేస్తున్నారని అర్థం చేసుకోగలను. అయితే గుజరాత్ గాడిదలపై మీరు చేసిన వ్యాఖ్యలు నన్ను అశ్చర్యానికి గురిచేశాయి. వేల మైళ్ల దూరంలో ఉన్న ఆ జంతువంటే ఎందుకంత కంగారో' అంటూ మోడీ చురకలంటించారు.
ఈ దేశ ప్రజలందరినీ తాను గురువుల్లా భావిస్తానన్న ప్రధాని.. గాడిదలను స్పూర్తిగా తీసుకుని పనిచేస్తానని అఖిలేశ్పై ఎదురుదాడి చేశారు. ఆ అమాయక జంతువు గురువుల పట్ల విధేయతతో ఉండడమేకాదు.. అంకితభావం, రేయింబవళ్లూ కష్టపడే తీరు మరచిపోవద్దని అన్నారు. మనసు నిర్మలంగా ఉంటే గాడిదలనూ ఆదర్శంగా తీసుకోవచ్చని చెప్పారు. అస్వస్థతతో ఉన్నా, ఆకలి వేస్తున్నా, అలసిపోయినా అవి తమ పనిని పూర్తిచేసే తీరుతాయన్నారు.
తమ వీపున పంచదార బస్తా ఉన్నా, నిమ్మకాయల బస్తా ఉన్నా గాడిదలకు ఎలాంటి వివక్షా ఉండదనీ, వాటిని విమర్శిస్తున్నవారు మాత్రం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని మోడీ అన్నారు. మునుపటి యూపీఏ సర్కారును నడిపిన కాంగ్రెస్ పార్టీ సయితం గుజరాత్ గాడిదలపై 2013లో తపాలాబిళ్లలు విడుదల చేసిందనీ, ఆ పార్టీతోనే సమాజ్వాదీకి ఇప్పుడు పొత్తు ఉందనీ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో జంతువులను కూడా విడిచిపెట్టకుంటా విమర్శలు చేయడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.
'మీ ప్రభుత్వానికి జంతువులంటే అమితమైన ప్రేమ ఉండటం సహజమే' అని మోడీ వ్యంగ్యంగా అన్నారు. అవి తప్పిపోయిన వెతికిపట్టుకుని మరీ మీ 'పనితీరు'ను రుజువుచేసుకున్న సంఘటనలున్నాయని పేర్కొన్నారు. 'ఎస్పి మంత్రి అజాంఖాన్ తన దున్నపోతులు తప్పిపోయాయని రామ్పూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆఘమేఘాలపై రంగంలోకి దిగి ఆచూకీ పట్టుకున్న ఘనత వహించిన ప్రభుత్వం మీది' అంటూ అఖిలేశ్పై విరుచుకుపడ్డారు. కాబట్టి జంతువుల మధ్య వివక్ష చూపడం సరైంది కాదని ఆయన అన్నారు.
కుటుంబ కలహాల కారణంగా గతిలేక కాంగ్రెస్తో సమాజ్వాదీ పొత్తుపెట్టుకుందనీ, విశాల హృదయంతో మాత్రం కాదని మోడీ విమర్శించారు. మహారాష్ట్రలో వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ ఆచూకీ ఎక్కడా లేదనీ, అలాంటి పార్టీ యూపీలో ఎస్పీని ఎలా రక్షిస్తుందనీ ప్రశ్నించారు. యూపీ సర్కారు నిస్సిగ్గుగా తమ పనే సమాధానం చెబుతుందంటూ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.